బాబు భద్రతా….మాది కాదంటే మాది కాదు !

ఏపీ ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు భద్రత మీద హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఎన్‌ఎస్‌జీ, ఏపీ ప్రభుత్వం, చంద్రబాబు తరపున లాయర్లు  తమ వాదనలు వినిపించారు. ఈ వాదనలు విన్న హైకోర్టు.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన అడ్వొకేట్ జనరల్‌కు పలు ప్రశ్నలు సంధించి వాదనలు విన్నది అయినా సరే తీర్పును రిజర్వ్‌‌లో ఉంచింది.

ఇక చంద్రబాబు భద్రతకు సంబంధించి.. క్లోజ్డ్ ప్రాక్సిమేట్ టీం అంటే (సీపీటీ )ని నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ చూసుకుంటారని అడ్వొకేట్ జనరల్ చెప్పారు. అయితే ఎన్‌ఎస్‌జీ తరఫున వాదనలు వినిపించిన అసిస్టెంట్ సొలిసిటరల్ జనరల్ కృష్ణమోహన్ చంద్రబాబు ఇంట్లో లేదా ఆఫీస్‌లో ఉన్నప్పుడు ఆయన భద్రత చూసుకోవాల్సింది లోకల్ పోలీసులని పేర్కొన్నారు.

ఎన్‌ఎస్‌జీకి సంబంధం లేదని ఆయన బయటకు వెళ్లినపుడు, జనాల్లో ఉన్నప్పుడు మాత్రమే ఎన్‌ఎస్‌జీ భద్రత కల్పిస్తుందని పేర్కన్నారు. జనరల్ క్లోజ్డ్ ప్రాక్సిమేట్ టీం అంతా స్థానిక పోలీసులే చూసుకోవాలన్నారు. ఈ బాధ్యతను ఎన్‌ఎస్‌జీ మీద వేయడం సరికాదన్నారు. ఇక చంద్రబాబు తరపు లాయర్లు మావోయిస్టులు, ఎర్రచందనం స్మగ్లర్ల నుంచి ప్రాణహాని ఉందని..

అందుకే గతంలో ప్రతిపక్ష నేత హోదాలో కల్పించిన భద్రతను కల్పించాలని కోరారు. అయితే తాము ఇప్పటికే చంద్రబాబుకు 74 మందితో భద్రత కల్పిస్తున్నామని ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన అడ్వొకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. కానీ ఎన్నికల్లో ఓటమి తర్వాత చంద్రబాబుకి సెక్యూరిటీ తగ్గించారని ఆయన తరఫు లాయర్లు కోర్టుకు విన్న వించారు.

గతంలో ఇంట్లో ఇద్దరు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్లు ఉండేవారని ఇప్పుడు ఒకర్నిమాత్రమే ఇచ్చారన్నారు. ప్రభుత్వం ఒక్కరినే ఇస్తుందని రెండో సీఎస్‌వోని ఇచ్చే ఉద్దేశం లేదని అడ్వొకేట్ జనరల్ అన్నారు. 24 గంటలు ఒక్కరే డ్యూటీలో ఉండటం కష్టం కదా అని ప్రభుత్వ తరపు లాయర్‌ను కోర్టు ప్రశ్నించింది. ముగ్గురి వాదనలు విన్న హైకోర్టు.. తీర్పును రిజర్వ్‌లో ఉంచింది.