పూర్వ స్థాయికి వ్యాపార కార్యకలాపాలు

పూర్వ స్థాయికి వ్యాపార కార్యకలాపాలు

కొత్త కేసులు క్రమంగా తగ్గే కొద్దీ .. వ్యాపార కార్యకలాపాలు తిరిగి కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ పూర్వ స్థాయికి (మార్చి నాటి) పుంజుకున్నాయని జపాన్‌ బ్రోకరేజి సంస్థ నొమురా వెల్లడించింది. ఆదివారంతో ముగిసిన వారంలో ఇందుకు సంబంధించిన సూచీ ఎన్‌ఐబీఆర్‌ఐ (నొమురా ఇండియా బిజినెస్‌ రిజంప్షన్‌ ఇండెక్స్‌) 95.7 పాయింట్లకు చేరినట్లు తెలిపింది. అంతక్రితం వారం ఇది 91 పాయింట్లుగా ఉంది. దీంతో వరుసగా సూచీ ఏడో వారం పెరిగినట్లయింది.

జూన్‌ గణాంకాలు చూస్తే సీక్వెన్షియల్‌గా పరిస్థితులు మెరుగుపడినట్లుగా కనిపిస్తుండగా, జులై తొలి నాళ్ల డేటా మిశ్రమంగా ఉందని నొమురా తెలిపింది. మొదటి వారంలో రైల్వే రవాణ ఆదాయాలు, జీఎస్‌టీ ఈ–వే బిల్లులు తగ్గగా.. విద్యుత్‌కి డిమాండ్‌ భారీగా పెరగడం ఇందుకు నిదర్శనంగా పేర్కొంది. జూన్‌లో సగటున రోజుకు 38 లక్షల డోసుల టీకాలు వేయగా, జులైలో ఇప్పటిదాకా వేక్సినేషన్‌ ప్రక్రియ పెద్దగా పుంజుకోలేదని నొమురా వివరించింది. ఆగస్టు నుంచి మళ్లీ టీకాలు వేయడం వేగవంతం కావచ్చని పేర్కొంది. అయితే, ప్రయాణాలు చేయడం పెరిగే కొద్దీ థర్డ్‌ వేవ్‌ వచ్చే అవకాశాలు కీలకమైన రిస్కుగా ఉండగలవని నొమురా తెలిపింది.