రష్యాను వెంటాడుతున్న విమాన ప్రమాదాలు

రష్యాను వెంటాడుతున్న విమాన ప్రమాదాలు

రష్యాను వరుస విమాన ప్రమాదాలు వెంటాడుతున్నాయి. జూలై 6న 28 మంది ప్రయాణికులతో వెళ్తున్న విమానం రాడార్‌ నుంచి అదృశ్యమై ఆ తర్వాత కూలిపోయిన సంగతి తెలిసిందే. తాజాగా శుక్రవారం ఇలాంటి సంఘటన మరొకటి చోటు చేసుకుంది. సుమారు 13 మందికి పైగా ప్రయాణికులతో వెళ్తున్న విమానం అదృశ్యమయింది.

సైబీరియన్ నగరం టాస్క్‌ వెలుపల విమానం అదృశ్యమయినట్లు ఇంటర్‌ఫాక్స్‌ న్యూస్‌ ఏజెన్సీ తెలిపింది. విమానంలో ఎంత మంది ప్రయాణికులు ఉన్నారనే దాని గురించి ఖచ్చితమైన సమాచారం లేదని.. కాకపోతే 13-17 మంది వరకు ఉండవచ్చిన అభిప్రాయపడుతున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

రష్యాలోని పెట్రోపావ్‌లోవిస్క్‌– కామ్‌చట్‌స్కై నగరం నుంచి పలానా నగరానికి 28 మందితో బయలుదేరిన విమానం కూలిపోయిన సంగతి తెలిసిందే. ల్యాండింగ్‌కు కొంత సమయం ముందు రాడార్‌ నుంచి విమానం అదృశ్యమైంది. విమానంతో కమ్యూనికేషన్‌ ఆగిపోయింది. అనంతరం విమానానికి సంబంధించిన శకలాన్ని ఒకోట్స్‌ సముద్ర తీరప్రాంతంలో కనుగొన్నారు. విమానంలోని వారెవరూ బతికి ఉండకపోవచ్చని రష్యా మీడియా పేర్కొంది. విమానం సముద్రంలోని రాతిబండలను గుద్దుకొని ఉండొచ్చని ప్రాథమిక అంచనా వేశారు.