సాత్విక్‌ సాయిరాజ్‌కు కరోనా పాజిటివ్

సాత్విక్‌ సాయిరాజ్‌కు కరోనా పాజిటివ్

సుదీర్ఘ విరామం తర్వాత హైదరాబాద్‌లో ఈనెలారంభంలో జాతీయ బ్యాడ్మింటన్‌ శిక్షణ శిబిరం మొదలైన వెంటనే కరోనా కలకలం చెలరేగింది. ఈ శిబిరానికి హాజరైన మహిళల డబుల్స్‌ స్టార్‌ సిక్కి రెడ్డి, ఫిజియోథెరపిస్ట్‌ కిరణ్‌ కరోనా వైరస్‌ బారిన పడ్డారు. వెంటనే మరోసారి నిర్వహించిన కోవిడ్‌–19 టెస్టుల్లో వీరిద్దరికి నెగెటివ్‌ ఫలితం వచ్చింది. తాజాగా పురుషుల డబుల్స్‌ ప్లేయర్‌ సాత్విక్‌ సాయిరాజ్‌ (ఆంధ్రప్రదేశ్‌)కు కూడా కరోనా సోకింది. అతనిలో కరోనాకు సంబంధించి ఎలాంటి లక్షణాలు లేవు. ఈ మహమ్మారి సోకడంతో ప్రస్తుతం అమలాపురంలోని తన ఇంట్లోనే స్వీయ నిర్బంధంలో ఉన్న సాత్విక్‌… ఈనెల 29న ఆన్‌లైన్‌లో జరిగే ప్రతిష్టాత్మక జాతీయ క్రీడా అవార్డుల ప్రదానోత్సవానికి దూరం కానున్నాడు.

డబుల్స్‌లో తన భాగస్వామి చిరాగ్‌ శెట్టితో పాటు ఈ ఏడాది ‘అర్జున’ అవార్డుకు సాత్విక్‌ ఎంపికయ్యాడు. ‘కొన్నిరోజుల క్రితమే యాంటిజెన్‌ పరీక్షకు హాజరయ్యా. ఆ తర్వాత చేసిన ఆర్‌టీ–పీసీఆర్‌ పరీక్షలోనూ కరోనా సోకినట్లు తేలింది. ఐదు రోజులుగా క్వారంటైన్‌లోనే ఉంటూ చికిత్స తీసుకుంటున్నా. జ్వరం, జలుబు, ఒళ్లునొప్పుల్లాంటి లక్షణాలేవీ లేవు. మరో మూడు రోజుల తర్వాత మళ్లీ కరోనా టెస్టు చేయించుకుంటా. అదృష్టవశాత్తు మా కుటుంబసభ్యులెవరికీ కరోనా పాజిటివ్‌ రాలేదు’ అని 20 ఏళ్ల సాత్విక్‌ వివరించాడు. సాత్విక్‌తో పాటు మరో ఇద్దరు అవార్డు విజేతలు కూడా కరోనా కారణంగా ఈ వేడుకలకు హాజరు కాలేకపోతున్నారని భారత స్పోర్ట్స్‌ అథారిటీ (సాయ్‌) అధికారులు పేర్కొన్నారు. అయితే వారి పేర్లను మాత్రం వెల్లడించలేదు.