సంజనకు బెయిల్ మంజూరు

సంజనకు బెయిల్ మంజూరు

ఇటీవల కన్నడ సినీ పరిశ్రమలో డ్రగ్స్ రాకెట్ వ్యవహారం కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఇష్యూలో హీరోయిన్లు రాగిణి ద్వివేది, సంజనా గల్రానీల హస్తం ఉందనే కారణంతో వారిద్దరినీ బెంగుళూరు సెంట్రల్‌ క్రైమ్‌ బ్రాంచ్‌ (సీసీబీ) పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

సెప్టెంబర్ 8న డ్రగ్స్ కేసులో భాగంగా సంజనా గల్రానీ, రాగిణి అరెస్ట్ అయ్యారు. ఆ తర్వాత వారి వారి మొబైల్ డాటా పరిశీలించగా సంచలన విషయాలు బయటపడ్డాయి. దీంతో దాదాపు 3 నెలలుగా పోలీసుల అదుపులో ఉన్న సంజనకు ఎట్టకేలకు తాజాగా కోర్టు నుంచి ఊరట లభించింది.

డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సంజనకు కొన్ని షరతులు విధిస్తూ కర్ణాటక హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. గతంలో ఆమె బెయిల్ పిటిషన్ తిరస్కరించిన హైకోర్టు, తాజాగా ఆరోగ్య కారణాలు చూపుతూ సంజన మరోసారి బెయిల్ అప్లై చేయడంతో అంగీకరించింది. ప్రభుత్వ ఆసుపత్రిలో ఆరోగ్య పరీక్షలు నిర్వహించిన అనంతరం ఆమెకు బెయిల్ మంజూరు చేశారు.