దేశంలో సోషల్ మీడియాపై నిషేధం

దేశంలో సోషల్ మీడియాపై నిషేధం

సోషల్ మీడియాలో.. సూపర్ స్టార్..మెగాస్టార్ లాంటి బిరుదలన్నీ కలిపేసినా… రానంత స్టారిజం ఉన్న మోడీకి.. ఒక్క సారిగా ఇంత వైరాగ్యం ఎందుకొచ్చిందో.. చాలా మందికి అర్థం కాలేదు కానీ.. కొంత మంది ఆయన వ్యతిరేకులు మాత్రం భిన్నమైన కోణాలను వెలికి తీస్తున్నారు.నరేంద్రమోడీ సోషల్ మీడియా ఖాతాల నుంచి నిష్క్రమించాలని అనుకుంటున్నారు. ఈ విషయం ఆయనే స్వయంగా ప్రకటించడంతో.. దేశంలో ఓ రకంగా కలకలం రేగింది. అందులో.. అత్యంత ఆసక్తికరమైనది… సోషల్ మీడియాపై నిషేధం. దేశంలో సోషల్ మీడియాపై నిషేధం విధించడానికి… దానిపై ఓ వ్యతిరేకత ప్రజల్లో వ్యాపింప చేయడానికి కసరత్తుగా.. నరేంద్రమోడీ..ఈ క్విట్ సోషల్ మీడియా కాన్సెప్ట్‌ను ప్రచారంలో పెడుతున్నారన్న చర్చను.. శశిధరూర్ వంటి కాంగ్రెస్ నేతలు.. తెరపైకి తెచ్చారు. సోషల్ మీడియా ఇప్పుడు బహుముఖాలుగా విస్తరించింది.

నిరక్ష్యరాస్యులు కూడా సులువుగా ఉపయోగించేలా మారిపోయింది. డేటా విప్లవం వచ్చిన తర్వాత ..స్మార్ట్ యుగం ప్రారంభమైన తర్వాత ఈ సోషల్ మీడియా విస్తృతిని ఊహించలేకపోతున్నారు. ఈ మార్పు.. అటు చెడు .. ఇటు మంచికి కారణం అవుతోంది. చెడు ప్రధానంగా ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయడంలోనే ఉంది. దేశంలో రాజకీయ వాతావరణం అత్యంత ఉద్రిక్తంగా మారుతూండటం.. అసలు నిజం కన్నా… ఫేక్ న్యూసే ఎక్కువగా ప్రజలకు చేరుతూండటంతో.. అనేక చోట్ల పరిస్థితులు అదుపుతప్పుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితిని కంట్రోల్ చేయడానికి ప్రధానమంత్రి నరేంద్రమోడీ.. సోషల్ మీడియా కట్టడి ఆలోచన చేస్తున్నారంటున్నారు.