Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
మిత్ర పక్షాల తిరుగుబాటు, అవినీతి ఆరోపణలు, ఉప ఎన్నికల్లో ఓటమి, కాంగ్రెస్ పుంజుకుంటోందన్న విశ్లేషణల నడుమ కష్టకాలంలో ఉన్న బీజేపీకి రాజ్యసభ ఎన్నికల ఫలితాలు పెద్ద ఊరటనిచ్చాయి. అత్యధిక స్థానాలను గెలుచుకుని, బీజేపీ రాజ్యసభలోనే అతిపెద్దపార్టీగా అవతరించింది. తాజాగా 11 స్థానాల్లో గెలుపొందిన బీజేపీ తన బలాన్ని 58 నుంచి 69కి పెంచుకుంది. 245 మంది సభ్యులున్న పెద్దలసభలో పూర్తి స్థాయి ఆధిక్యం రానప్పటికీ విపక్ష కాంగ్రెస్ కన్నా సంఖ్యాబలంలో మెరుగైన స్థితికి చేరుకుంది. బీజేపీ తన బలాన్ని పెంచుకుంటే… కాంగ్రెస్ మాత్రం నాలుగు స్థానాలు కోల్పోయి 54 నుంచి 50కి పడిపోయింది.
ఎన్డీఏ నుంచి టీడీపీ బయటకురావడం, బీజేపీకి కంచుకోటలాంటి ఉత్తర్ ప్రదేశ్ లోని రెండు లోక్ సభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో ఓటమి పాలవడం, ప్రతిపక్షాలన్నీ ఏకతాటిపైకి వచ్చే సూచనలు బీజేపీని ఉక్కిరిబిక్కరి చేస్తున్న తరుణంలో 11 స్థానాల్లో గెలుపొందడంతో ఆ పార్టీకి మానసిక స్థైర్యం లభించింది. ఇక మీదట ప్రత్యర్థులను దీటుగా ఎదుర్కోడానికి ఈ విజయం టానిక్ లా పనిచేస్తుందని మోడీ, అమిత్ షాలు భావిస్తున్నారు. రాజ్యసభ ఫలితాలు మరోరకంగానూ బీజేపీకి లాభించనున్నాయి. ఇప్పటివరకూ ప్రభుత్వం ప్రవేశపెట్టే బిల్లులు లోక్ సభలో ఆమోదం పొందినా, రాజ్యసభలో మాత్రం సరైన సంఖ్యాబలం లేక ఆగిపోయేవి. కొన్నిసార్లు విపక్షాలను..బిల్లుకు మద్దతు ఇవ్వాల్సింది కోరాల్సి వచ్చింది. తాజా విజయంతో పెరిగిన సంఖ్యాబలం..బిల్లుల విషయంలో బీజేపీకి ఎదురులేని పరిస్థితి కల్పించనుంది.