ఏడో స్థానంలో నిలిచిన బాలీవుడ్‌ క్వీన్‌

ఏడో స్థానంలో నిలిచిన బాలీవుడ్‌ క్వీన్‌

మహమ్మారి కరోనా సినీ రంగం మీద కూడా తీవ్ర ప్రభావం చూపింది. లాక్‌డౌన్‌ కారణంగా థియేటర్లు మూతపడ్డాయి. ఓటీటీలో కొన్ని సినిమాలు విడుదలవుతున్నా వెండితెరపై అభిమాన హీరోహీరోయిన్ల సందడి లేక ఫ్యాన్స్‌ నిరాశకు లోనవుతున్నారు. సిల్వర్‌ స్క్రీన్‌పై ‘గ్లామర్ మిస్‌’ అయ్యిందంటూ ఉసూరుమంటున్నారు. కరోనా కారణంగా గ్లామర్‌ ఫీల్డ్‌ లో ఒకలాంటి స్తబ్ద వాతావరణం నెలకొంది. ఇలాంటి తరుణంలో ఇండియా టుడే నిర్వహించిన ‘మూడ్‌ ఆఫ్‌ ది నేషన్‌’ సర్వే సినీ విభాగంలో బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ దీపికా పదుకునే మరోసారి అగ్రస్థానం కైవసం చేసుకున్నారు. గ్లోబల్‌ స్టార్‌ ప్రియాంక చోప్రా, కత్రినా కైఫ్‌, ఐశ్వర్యా రాయ్‌ బచ్చన్‌, అనుష్క శర్మలను వెనక్కి నెట్టి అత్యంత ప్రజాదరణ గల నటీమణిగా నిలిచారు.

ఈ సర్వేలో దీపికకు 16 శాతం ఓట్లు పడగా.. ప్రియాంక చోప్రాకు 14, కత్రినా కైఫ్‌కు 13, ఐశ్వర్యరాయ్‌ బచ్చన్‌కు 10, అనుష్క శర్మకు 9 శాతం ఓట్లు పోలయ్యాయి. ఇక స్టార్‌ కిడ్‌ అలియా భట్‌తో పాటు బాలీవుడ్‌ క్వీన్‌గా పేరొందిన కంగనా రనౌత్‌ 6 శాతం ఓట్లతో సంయుక్తంగా ఏడో స్థానంలో నిలవడం విశేషం. ఇక కపూర్‌ ఖాందాన్‌ వారసురాలు కరీనా కపూర్‌ ఖాన్‌కు కేవలం 3 శాతం ఓట్లే పడ్డాయి. కాగా రామ్‌లీలా, పద్మావత్‌ తదితర సినిమాలతో అగ్ర కథానాయికగా ఎదిగి అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్‌గా వెలుగొందుతున్న దీపికా పదుకునే.. ప్రభాస్‌ సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టనున్న సంగతి తెలిసిందే. ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాలో ‘డార్లింగ్‌’తో ఆమె జతకట్టనున్నారు.