ప్రస్తుతం భారతీయ సినిమా ప్రపంచవ్యాప్తంగా తన సత్తా చాటుతోంది. ముఖ్యంగా టాలీవుడ్ సినిమాలు దేశీయ మార్కెట్ను దాటి అంతర్జాతీయ స్థాయిలో భారీ గుర్తింపు తెచ్చుకుంటున్నాయి. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ప్రారంభించిన గ్లోబల్ ట్రెండ్తో తెలుగు సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకమైన మార్కెట్ ఏర్పడింది. దీంతో ఇతర భాషల ఇండస్ట్రీలకు చెందిన మేకర్స్ కూడా పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు తెరకెక్కిస్తూ అదే రేంజ్ రీచ్ను సొంతం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
అయితే టాలీవుడ్కు పెరుగుతున్న క్రేజ్పై బాలీవుడ్లోని కొందరు సానుకూలంగా స్పందిస్తుంటే, మరికొందరు మాత్రం తరచూ తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారనే చర్చ సోషల్ మీడియాలో కనిపిస్తూనే ఉంటుంది. తాజాగా ఈ చర్చలో బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ (Siddharth Anand) పేరు వినిపిస్తోంది.
గతంలో ‘యానిమల్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా బాలీవుడ్పై మంత్రి మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఓ నెటిజన్ టాలీవుడ్కు చెందిన పలువురు టాప్ హీరోల సినిమాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయంటూ ఓ పోస్టు పెట్టాడు. ఆ పోస్టుకు సిద్ధార్థ్ ఆనంద్ వ్యంగ్యంగా ‘Oops’ అంటూ రిప్లై ఇవ్వడం అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
సిద్ధార్థ్ ఆనంద్ చేసిన ఆ కామెంట్పై తెలుగు సినీ అభిమానులు తీవ్రంగా స్పందించారు. ‘వార్’, ‘పఠాన్’ వంటి భారీ విజయాలు అందించిన సిద్ధార్థ్ ఆనంద్ ప్రస్తుతం షారుఖ్ ఖాన్తో ‘కింగ్’ వంటి భారీ ప్రాజెక్ట్లో పనిచేస్తున్నాడు. అలాంటి స్టార్ డైరెక్టర్ టాలీవుడ్ సినిమాలు, హీరోలపై ఇలాంటి రీతిలో స్పందించాల్సిన అవసరం ఏముంది అంటూ పలువురు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
ఇదిలా ఉంటే, టాలీవుడ్ హీరోల సినిమాలు ఫ్లాప్ అయ్యాయని పేర్కొన్న అసలు నెటిజన్ తన పోస్టును డిలీట్ చేసినప్పటికీ, సిద్ధార్థ్ ఆనంద్ ఇచ్చిన రిప్లై మాత్రం సోషల్ మీడియాలో మిగిలిపోయింది. దీంతో ఈ అంశం మరోసారి చర్చకు వచ్చింది.
అంతేకాదు, గతంలో ప్రభాస్ను ‘ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్’గా పేర్కొంటూ ‘స్పిరిట్’ సినిమాకు సంబంధించిన ప్రచారం జరిగిన సమయంలో కూడా సిద్ధార్థ్ ఆనంద్ పరోక్షంగా స్పందించినట్లు సోషల్ మీడియాలో చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో టాలీవుడ్ విషయంలో సిద్ధార్థ్ ఆనంద్ వైఖరి ఏంటనే ప్రశ్నలు మరోసారి తెరపైకి వచ్చాయి.
అయితే సినీ పరిశ్రమల్లో పోటీ అనేది సహజమే. కానీ టాలీవుడ్ సినిమాలు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందుతున్న సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు, సోషల్ మీడియా రిప్లైలు అభిమానుల మధ్య అనవసరమైన వివాదాలకు దారితీస్తున్నాయి. మొత్తానికి సిద్ధార్థ్ ఆనంద్ తాజా రిప్లైతో మరోసారి టాలీవుడ్ వర్సెస్ బాలీవుడ్ చర్చ సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది.






