ప్రియుడు స్కెచ్.. భర్త హత్య.. ఒంటరిగా.. ప్రియురాలు

తెలంగాణలోని నల్గొండలో దారుణం చోటుచేసుకుంది. వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని చెప్పి ప్రియుడితో కలిసి ఓ మహళ.. ఏకంగా భర్తనే హతమార్చింది. నల్గొండ పరిధిలోని అద్దంకి బైపాస్‌లో ఉన్న ఓ పైపుల కంపెనీ వద్ద జరిగిన హత్య కేసులో నిందితులను తాజాగా పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. కొండమల్లేపల్లి మండలం గుమ్మడవెల్లి గ్రామానికి చెందిన మారం వెంకట్‌రెడ్డికి 13 ఏళ్ల క్రితం పానగల్‌కు చెందిన చాపల స్రవంతితో వివాహం జరిగింది. వారికి ఇద్దరు కుమారులు ఉన్నారు. వెంకట్‌రెడ్డి పెళ్లికి ముందు నుంచే చోరీలు, చైన్‌స్నాచింగ్‌ చేస్తూ ఆ డబ్బుతో జల్సాలు చేసేవాడు. పెళ్లైన తర్వాత కూడా అతడితో మార్పు రాలేదు. తరుచూ చోరీలకు పాల్పడి పోలీసులకు దొరికిపోవడంతో అతడిపై సుమారు 40 కేసులు నమోదయ్యాయి.

అయితే స్రవంతి స్కూల్‌డేస్‌లో మున్నా శేఖర్ అనే వ్యక్తిని ప్రేమించింది. అయితే పెద్దల ఒత్తిడితో వెంకట్‌రెడ్డిని పెళ్లి చేసుకుంది. కాగా భర్త తీరుతో విసిగిపోయిన ఆమె శేఖర్‌తో అక్రమ సంబంధం పెట్టుకొని వ్యవహారాన్ని నడుపుతుంది. భర్త లేని సమయంలో ప్రియుడిని ఇంటికే రప్పించుకుని రాసలీలలు సాగించేది. ఈ విషయం వెంకట్‌రెడ్డికి తెలిసి గొడవలు పెట్టుకుంది. భర్త వేధింపులు భరించలేక ఆమె టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పెద్ద మనుషుల మధ్య పంచాయతీ జరగడంతో దంపతులిద్దరూ రాజీకి వచ్చి కలిసి కాపురం చేయసాగారు.

ఆ తర్వాత కొంత కాలానికి వెంకట్‌రెడ్డి సాగర్‌రోడ్డులో ఎస్‌ఎల్‌బీసీలో ఉన్న ఓమద్యం షాపులో మద్యం చోరీ చేసి పోలీసులకు చిక్కాడు. దీంతో జైలుకు వెళ్లి బెయిల్‌పై బయటకు వచ్చాడు. కాగా అతడు జైల్లో ఉన్నన్ని రోజులు స్రవంతి, శేఖర్ లు మరింత దగ్గరయ్యారు. అప్పుడే శేఖర్‌ మదిలో ఓ దురాలోచన వచ్చింది. వెంకట్‌రెడ్డిని అడ్డు తొలగించుకుంటే ప్రియురాలిని పెళ్లి చేసుకోవచ్చని పథకం వేశాడు. ఇదే విషయాన్ని స్రవంతికి చెప్పగా ఆమె కూడా ఓకే చెప్పింది. దీంతో మార్చి 26న వెంకట్‌రెడ్డి డీసీఎంలో హైదరాబాద్‌ బయల్దేరాడు. మర్రిగూడ స్టేజీ వద్ద శేఖర్‌తో పాటు అతడి స్నేహితులతో కలిసి కారును డీసీఎంకు అడ్డుపెట్టి వెంకట్‌రెడ్డిని కారులో ఎక్కించుకున్నారు.

పైపుల కంపెనీ వద్ద నిర్మానుష్య ప్రదేశంలో శేఖర్‌ తన వెంట తెచ్చిన కత్తితో వెంకట్‌రెడ్డి గొంతు, వీపుపై పొడవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాలు, కాల్‌డేటా ఆధారంగా కేసును చేధించారు. నిందితులైన పానగల్‌కు చెందిన మున్నా శేఖర్‌, మృతుడి భార్య చాపల స్రవంతి, శ్రీరామ్‌నగర్‌ కాలనీకి చెందిన విశ్వనాథ్, ఈశ్వర్‌ అలియాస్‌ చింటు, దుంపల సాయికుమార్‌లను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఇందుకు సంబంధించి అన్ని విషయాలను నల్గొండ రూరల్ పోలీస్‌స్టేషన్‌లో డీఎస్పీ వెంకటేశ్వర్‌రెడ్డి మీడియాకు తెలిపారు.