తల్లి పై గొడవ పడ్డ అన్నను.. చంపిన తమ్ముడు…..

ఆంధ్రప్రదేశ్ లో ఘోరం జరిగింది. అన్నదమ్ముల మధ్య గొడవ ప్రాణాన్ని తీసింది. చిత్తూరు జిల్లా చంద్రగిరిలో మంగళవారం ఇద్దరి అన్నదమ్ముల మధ్య గొడవ చోటుచేసుకుంది. అది ప్రాణానికి తెచ్చింది. శ్రీకాళహస్తికి చెందిన హమీద్‌, రహమత్‌ దంపతులు తమ కొడుకులు అన్సర్‌బాషా, షాదిక్‌తో కలిసి బతుకుదెరువు కోసం ఆరు మాసాల క్రితం చంద్రగిరిలోని ముకుంద వీధికి వలస వచ్చారు. పాతపేట బజారువీధిలో బిర్యానీ సెంటర్‌ ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్నారు.

అయితే కరోనా వైరస్ కారణంగా విధించిన లాక్‌డౌన్‌తో వారి బిర్యానీ సెంటర్‌ వ్యాపారం బంద్ అయింది. దీంతో ఈ మధ్య లాక్ డౌన్ సడలింపులలో భాగంగా మద్యం షాపులు తెరుచుకోవడంతో రోజు మద్యానికి బానిసైన పెద్ద కుమారుడు అన్సర్‌ బాషా మంగళవారం తల్లితో పాటు పాతపేటలోని ఓ మెడికల్‌ షాపుకు వెళ్లాడు. ఆ సమయంలో రూ.300 ఇవ్వాలని తల్లిని కోరగా ఆమె ఇవ్వనని వారించింది. దాంతో కోపానికి గురైన అన్సర్ భాషా తల్లిపై దాడికి దిగాడు. అదే సమయంలో అక్కడికి చేరుకున్న చిన్న కొడుకు షాదిక్‌ తల్లికి అడ్డుగా నిలిచి అన్నతో గొడవ పడ్డాడు. తల్లిని ఏదైనా చేస్తాడేమోనన్న ఆందోళనతో తమ్ముడు షాదిక్‌ మెడికల్‌ షాపులోని కత్తెరతో అన్నను గొంతు, పొట్ట, కిడ్నీ భాగంలో పొడిచేశాడు. ఆ ఘటన స్థానికంగా కలకలం రేగింది. స్థానికులు వెంటనే అన్సర్‌బాషాను సమీపంలోని ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. కాగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. కాగా చంద్రగిరి పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి షాదిక్‌ను అరెస్ట్ చేశారు.