చున్నీతో హత్య చేసిన కుటుంబ సభ్యులు

చున్నీతో హత్య చేసిన కుటుంబ సభ్యులు

కుటుంబ సభ్యులను వేధిస్తున్న వ్యక్తిని చున్నీతో హత్య చేసిన సంఘటన మంగళ్‌హాట్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఆదివారం ఉదయం చోటు చేసుకుంది. మంగళ్‌హాట్‌ ఇన్‌స్పెక్టర్‌ రణవీర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం… అన్నదమ్ములైన రవీందర్, మహేందర్, ప్రసాద్‌ (21) తల్లితో కలిసి ఉంటున్నారు. ఇటీవల ప్రసాద్‌ తరచుగా డబ్బు విషయమై అన్నలతో, తల్లితో గొడవ పడుతుండటంతో రవీందర్‌ జీడిమెట్లకు మకాం మార్చాడు.

అయినప్పటికీ ప్రసాద్‌ మద్యం సేవించి వచ్చి తరచుగా మరో అన్న మహేందర్‌, వదిన, తల్లితో గొడవ పడుతుండటంతో వారు కూడా ఇల్లు మారారు. ఇంట్లో ఒక్కడే ఉంటున్న ప్రసాద్‌ తన ప్రవర్తన మార్చుకోకుండా మహేందర్‌ వద్దకు వెళ్లి తల్లిని, అన్నను తరచుగా తిడుతుండడంతో మహేందర్‌ జీడిమెట్లలో ఉన్న రవీందర్‌కు ఫోన్‌చేసి మాట్లాడేందుకు రావాలని కోరాడు.

ఆదివారం రాత్రి రవీందర్, మహేందర్‌ కలిసి ప్రసాద్‌ ఇంటికి వెళ్లగా మద్యం సేవించి ఉన్న ప్రసాద్‌ వారితో గొడవ పడ్డారు. దీంతో ఆవేశానికి గురైన రవీందర్, మహేందర్, ప్రసాద్‌ మెడను చున్నీతో ఉరి బిగించి హత్య చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ప్రసాద్‌ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి అనంతరం బంధువులకు అప్పగించారు. నిందితులపై కేసు నమోదు చేశారు.