అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ ఎమ్మెల్యే మహేశ్ నేగిపై పోలీసులు ఎట్టకేలకు కేసు నమోదు చేశారు. ఆయన భార్యపై కూడా కేసు నమోదు చేసిన పోలీసులు బాధితురాలి ఫిర్యాదు మేరకు విచారిస్తామని చెప్పారు. ఎమ్మెల్యే దంపతులపై ఐపీసీ 376 (అత్యాచారం), 506 (నేరపూరిత కుట్ర) కింద కేసులు నమోదు చేశామని నెహ్రూ కాలనీ పోలీసులు తెలిపారు. కాగా, మహేశ్ నేగి తనను బెదిరించి పలుమార్లు అత్యాచారం చేశాడని, ఆయన కారణంగా ఓ పాపకు జన్మనిచ్చానని ఓ మహిళ ఆగస్టు 16న పోలీసులకు ఫిర్యాదు చేసింది.
అవసరమనుకుంటే తన బిడ్డకు డీఎన్ఏ పరీక్ష నిర్వహించాలని కూడా ఆమె కోరింది. అయితే, ప్రతిపక్ష కాంగ్రెస్ నాయకుల కుట్రలతోనే తనపై తప్పుడు ఆరోపణలు వచ్చాయని ఎమ్మెల్యే నేగి చెప్పుకొచ్చారు. ఏ విచారణకు సిద్ధమని ప్రకటించారు. కాగా, బాధిత మహిళ ఫిర్యాదుతో ప్రాథమిక ఆధారాలు సేకరించిన పోలీసులు ఈ మేరకు ఎమ్మెల్యేపై దంపతులపై కేసు నమోదు చేశారు. ద్వారాహత్ నియోజకవర్గం నుంచి నేగి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు.