హీరోలు నేరస్తులను కలవడమా…తప్పుడు సంకేతాలే !

CBN Comments On Jagan And Nagarjuna Meeting

టీడీపీ నేతలతో ఈరోజు ఉదయం నిర్వహించి నటెలీకాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైసీపీపై కీలక వ్యాఖ్యలు చేశారు. నేరాలు దాని వల్ల కలిగే లబ్ధే ఇప్పుడు వైసీపీకి దొరికిన రాజకీయమని, వారు దిక్కుతోచని స్థితి ఉన్నారని ఆయన వ్యాఖ్యానించారు. నేరస్థులతో సినీనటుల భేటీ దురదృష్టకరమని దీనివల్ల ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళతాయని బాబు అభిప్రాయపడ్డారు. సినీ పరిశ్రమకు ఏపీ ప్రభుత్వం ఎంతో అండగా నిలబడుతోందని, అభివృద్ధికి అండగా అందరూ నిలవాల్సిన సమయంలో పరిశ్రమ ప్రముఖులు నేరగాళ్లతో కలవడం ఏంటని ఆయన ప్రశ్నించారు. హైదరాబాద్ కేంద్రంగా కేసీఆర్ బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్నారని, వైసీపీలో ప్రస్తుతం పెత్తందారీ వ్యవస్థ నడుస్తోందని ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ యాత్ర చేస్తోందని, ఆ పార్టీ విషయంలో టీడీపీ స్పష్టతతో ఉందని చంద్రబాబు పేర్కొన్నారు. దేశ ప్రయోజనాల కోసం మాత్రమే జాతీయ స్థాయిలో పొత్తు ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.

పుల్వామా దాడితో తమకు సంబంధం లేదని పాక్ అంటోందని, ఈ విషయంలో రాజకీయ లబ్ధి దాగి ఉందా? అనే అనుమానం దేశవ్యాప్తంగా బలపడుతోందని మోడీని కార్నర్ చేస్తూ ఆయన వ్యాఖ్యానించారు. ఫిబ్రవరి 20న రాష్ట్ర విభజన బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందిందని, సరిగ్గా ఈ రోజుకు ఏపీకి ద్రోహం చేసి 5 ఏళ్లు అయ్యిందని ముఖ్యమంత్రి చంద్రబాబు గుర్తు చేశారు. నమ్మక ద్రోహ ఐదో వార్షికానికి నిరసనలు తెలపాలని, 5 కోట్ల మందిని నమ్మించి మోసం చేసి ఐదేళ్లయ్యిందని, ప్రత్యేక హాదాతో సహా మిగిలిన హామీలు గాలికి వదిలేశారని రాష్ట్రానికి పారిశ్రామిక రాయితీ ఇవ్వలేదని, వెనుకబడిన జిల్లాలకిచ్చిన రూ.350 కోట్లు వెనక్కి తీసుకున్నారని ఆయన పేర్కొన్న్నారు.