రంగంలోకి కేంద్రం… శాసన మండలి రద్దు లేనట్లే

ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఏపీ సీఎం జగన్ కు కేంద్ర పెద్దలు ఒక విషయాన్ని స్పష్టం చేశారని జోరుగా ప్రచారం సాగుతుంది. ఈ కీలక సూచనల మేరకు జగన్ అడుగులు వేస్తున్నారని టాక్ నడుస్తోంది. ఆంధ్రప్రదేశ్ శాసన మండలి రద్దు విషయంలో ఢిల్లీ పెద్దలు ఒక నిర్ణయానికి వచ్చారని సమాచారం. ఇప్పుడున్న పరిస్థితుల్లో మండలిని రద్దు చేయడం వీలయ్యే విషయం కాదని తేల్చేసినట్లు పుకార్లు షికారు చేస్తున్నాయి. దీంతో మండలిని రద్దు చేయకుండా టీడీపీ ఎమ్మెల్సీలను మేనేజ్ చేసుకోవాలని ఢిల్లీలోని కమలం పెద్దలు సీఎం జగన్ కు సలహా ఇచ్చారని సమాచారం.

రాష్ట్రంలో ప్రస్తుతం పరిణామాలు చూస్తుంటే ఆ ప్రచారం వాస్తవమేనని జనాలంటున్నారు. దేశంలో ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావం నానాటికీ పెరుగుతుండడంతో పార్లమెంటులో ఏపీ శాసన మండలి రద్దు బిల్లు పెట్టి పాస్ చేసే పరిస్ధితులు లేవు. అందుకే టీడీపీ ఎమ్మెల్సీలను మేనేజ్ చేసుకోవాలని కేంద్ర పెద్దలు జగన్ కు సూచించినట్లుగా టాక్. అయితే శాసనమండలిలో ప్రస్తుతం యాభై ఎనిమిది మంది సభ్యులున్నారు. అందులో ఇరవై ఆరు మంది టీడీపీ ఎమ్మెల్సీలే. వారిలో ముగ్గురు ఇప్పటికే వైసీపీ కండువా కప్పుకున్నారు. శాసనమండలిని రద్దు చేస్తున్నట్టు సీఎం జగన్ నిర్ణయం తీసుకున్న తర్వాతే ఇద్దరు ఎమ్మెల్సీలు వైసీపీలో చేరిపోయారు. తాజాగా అనంతపురం జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ శమంతకమణి, మాజీ ఎమ్మెల్యే యామినీ బాల టీడీపీని వీడి వైసీపీలో చేరారు. సీఎం జగన్ ఓ రెండు సంవత్సరాలు తనవి కాదనుకుంటే.. ఆ తర్వాత శాసనమండలిలో వైసీపీకి సంఖ్యాబలం పెరుగుతుంది కాబట్టి ఇప్పుడు తొందరపడి శాసనమండలిని రద్దు చేసుకోవడం కంటే ఓ రెండేళ్ళు ఆగటమే మంచిదని అప్పుడు పార్టీకి సంఖ్యాబలం పెరుగుతుందనీ కేంద్రం పెద్దలు జగన్ కు నచ్చజెప్పినట్టు ప్రచారం జరుగుతోంది.

అంతేకాకుండా ఇప్పటికే టీడీపీ నేతలను పెద్ద ఎత్తున వైసీపీలోకి చేర్చుకుంటున్నారు. వారికి మండలి పదవులు ఇవ్వడానికి అనుకూలంగా ఉంటుందని చెప్పారని కూడా టాక్. మండలిని రద్దు చేసుకోవడం కంటే ఆపరేషన్ ఆకర్ష్ ద్వారా మెల్లమెల్లగా టీడీపీ ఎమ్మెల్సీలను తమ వైపు తిప్పుకుంటే లాభదాయకంగా ఉంటుందని చెప్పడంతో జగన్ కూడా కొంచం మెత్తబడినట్లు సమాచారం. మరో పక్క శాసనమండలిని రద్దు చేస్తారన్న ధీమాతో ఎమ్మెల్సీలు మంత్రులు అయిన మోపిదేవి వెంకట రమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్ లను జగన్ రాజ్య సభకు పంపారు. ఆ ఎన్నికలు కూడా త్వరలోనే జరగనున్నాయి. ఒకవేళ కేంద్రం పెద్దలు చెప్పినట్టు మండలి విషయంలో జగన్ కొంచెం ఆలోచించినా.. వారిద్దరినీ ఎందుకు రాజ్యసభకు పంపుతారని వాదించేవారు కూడా ఉన్నారు. అయితే మోపిదేవి, పిల్లి నామినేషన్ వేసిన తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో భాగంగా ఈ చర్చ వచ్చిందని అంటున్నారు. మండలి రద్దు వ్యవహారం ప్రస్తుతం కేంద్రం కోర్టులో ఉంది. కేంద్రం పెద్దలు కూడా వద్దని చెబుతున్నారు కాబట్టి జగన్ ఢిల్లీ నేతల మీద ఒత్తిడి చేసే అవకాశం ఉండదని భావిస్తున్నారు. అందుకే మండలిలో తమ పదవులకు ఢోకా ఉండబోదని టీడీపీ నేతలు లెక్కలు వేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం టీడీపీకి చెందిన ఎక్కువ మంది సభ్యులను ఆకర్షిస్తే తమ పని సులువు అయిపోతుంది అని ఆలోచనలో వైసీపీ అధినేత జగన్ ఉన్నారని కూడా సమాచారం. ఆ దిశగానే పావులు కదుపుతున్నారని తెలుస్తోంది. ఇప్పటికే ముగ్గురుని చేర్చుకున్న జగన్ రాబోయే రోజుల్లో మరింత మందిని ఆకర్షించే ప్రయత్నాలు చేస్తారని చెప్తున్నారు. కేంద్ర పెద్దల సలహాతో పాటు ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ప్లాన్ ప్రకారం ముందుకెళ్లడమే బెటరనే ఆలోచనలో జగన్ ఉన్నారని కూడ సర్వత్రా చర్చ సాగుతుంది.