Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
నంద్యాల, కాకినాడ ఎన్నికల ఫలితాలు వచ్చాక వైసీపీ అధినేత జగన్ భవిష్యత్ మీద నీలినీడలు అలుముకున్నాయి. 2014 పోయినా 2019 వుంది కదా అన్న ఆశతో వున్న వైసీపీ శ్రేణులకు నంద్యాల ఫలితం గట్టి షాక్ ఇచ్చింది. రాయలసీమలో అందునా వైసీపీ కి కంచుకోట లాంటి స్థానంలో టీడీపీ 27 వేలకి పైగా మెజారిటీ తో గెలవడంతో జగన్ నివ్వెరపోయారు. టీడీపీ శ్రేణులు మళ్లీ తమదే అధికారం అంటూ పండగ చేసుకుంటున్నాయి. అంది వచ్చిన ఈ అవకాశాన్ని వినియోగించుకోడానికి టీడీపీ అధినేత చంద్రబాబు తెలివిగా పావులు కదుపుతున్నారు. సీమలో వైసీపీ బలం అనేది ఉట్టి మాటే అని నిరూపించడానికి సీఎం విసురుతున్న మరో పాచిక జగన్ పాలిట అగ్నిపరీక్షలా మారనుంది.
కాకినాడ తరహాలో రాష్ట్రంలో కొన్ని స్థానాల్లో ప్రత్యేక కారణాలతో మునిసిపల్ ఎన్నికలు జరగలేదు. అలాంటి వాటిలో ఇప్పుడు ఎన్నికలు జరిపితే జగన్ ని దెబ్బ మీద దెబ్బ కొట్టొచ్చని బాబు ఆలోచన. అలా ఎన్నికలు జరగాల్సిన వాటిలో జగన్ సొంత జిల్లా కడపలోని రాజంపేట మున్సిపాలిటీ కూడా వుంది. అక్కడ ఎన్నికలకు వున్న అడ్డంకులు తొలగించి రంగంలోకి దిగాలని బాబు డిసైడ్ అయ్యారు. ఈ మేరకు స్థానిక దేశం నేతలకు ఆదేశాలు కూడా వెళ్లాయి. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజంపేటలో వైసీపీకి ఎన్నికలు ఎదుర్కోవటమంటే అగ్నిపరీక్షే అవుతుంది. గెలిస్తే సొంత జిల్లాలో గెలవడం ఏముంది అంటారు, ఓడితే కడపలో కూడా పట్టు పోయింది అంటారు. పైగా అధికారంలో వున్నప్పుడు చంద్రబాబు వ్యూహాల్ని తట్టుకోవడం ఎంత కష్టమో జగన్ అండ్ కో కి నంద్యాల, కాకినాడ ఎన్నికల తర్వాత బాగా అర్ధం అయ్యింది. ప్రస్తుతం రాజంపేట మునిసిపల్ ఎన్నికలు అన్న విషయం బాబుకి చెలగాటం అయితే జగన్ కి ప్రాణసంకటం.