జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్‌ లకు ప్రభత్వం శ్రీకారం

జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్‌ లకు ప్రభత్వం శ్రీకారం

రాష్ట్రంలో ‘జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్‌లు’లకు ప్రభత్వం శ్రీకారం చుట్టింది. జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిలకు సంబంధించిన లేఅవుట్లు, వెబ్‌సైట్‌ను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. ఇప్పటికే 30 లక్షల ఇళ్ల పట్టాలు పంపిణీ చేశామని అన్నారు. ప్రతీ పేదవాడికి సొంతిల్లు ఉండాలని ప్రభుత్వ ధ్యేయమని తెలిపారు. ఇప్పటికే పేదల ఇళ్ల నిర్మాణాలు కూడా ప్రారంభమయ్యాయని అన్నారు.

మధ్యతరగతి ప్రజల సొంతింటి కల నెరవేరనుందని సీఎం జగన్‌ పేర్కొన్నారు. 150, 200, 240 చదరపు గజాల ప్లాట్లు ఎంచుకునే అవకాశం ఉందని తెలిపారు. తొలిదశలో ధర్మవరం, మంగళగిరి, రాయచోటి, కందుకూరు, కావలి, ఏలూరులో ప్లాట్ల కేటాయింపు ఉంటుందని తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో జగనన్న టౌన్‌షిప్‌లు ఏర్పాటు సిద్ధం కానున్నాయని సీఎం తెలిపారు. తొలి విడతలో గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని నవులూరు, అనంతపురం జిల్లా ధర్మవరం, ప్రకాశం జిల్లా కందుకూరు, వైఎస్సార్‌ కడప జిల్లా రాయచోటి, నెల్లూరు జిల్లాలోని కావలి, పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు వద్ద లేఅవుట్లు సిద్ధం చేశారు.

అన్ని అనుమతులు, వసతులతో డిమాండ్‌కు అనుగుణంగా 150, 200, 240 చదరపు గజాల ప్లాట్లను సిద్ధం చేశారు. రూ.18 లక్షలకంటే తక్కువ వార్షిక ఆదాయం ఉన్నవారికి మాత్రమే ఇళ్ల స్థలాల కేటాయింపు జరుగుతుందని సీఎం జగన్‌ తెలిపారు. వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. అన్ని చోట్లా పట్టణ ప్రణాళికా విభాగం నియమాల మేరకు లేఅవుట్లు సిద్ధం చేశామని సీఎం అన్నారు. ప్రభుత్వం ఉద్యోగులకు 10 శాతం ప్లాట్లు, ధరలో 20 శాతం తగ్గింపు ఉంటుందని పేర్కొన్నారు.

వెబ్‌సైట్‌ ద్వారా నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కానుందని సీఎం జగన్‌ తెలిపారు. అత్యంత పారదర్శకంగా ప్లాట్ల కేటాయింపు జరుగుతుందని సీఎం పేర్కొన్నారు. ప్లాట్ల ధరను నాలుగు వాయిదాల్లో చెల్లించే అవకాశం ఉందని తెలిపారు. 60 అడుగుల బీటీ రోడ్లు, 40 అడుగుల సీసీ రోడ్లు, నాణ్యమైన మౌలిక సదుపాయాలు ఉంటాయని సీఎం చెప్పారు. వాణిజ్య సముదాయాలు, బ్యాంకులకు స్థలాల కేటాయింపు ఉంటుందని సీఎం జగన్‌ చెప్పారు.