విమానంలో కరోనా రోగి మృతి

విమానంలో కరోనా రోగి మృతి

కరోనా వైరస్ ఓ ప్రయాణికురాలు విమానంలోనే మృతిచెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆమె కరోనాతో చనిపోయినా, వైరస్ ఉన్నట్టు అధికారులు గుర్తించలేకపోవడం గమనార్హం. జులై 24న టెక్సాస్‌కు చెందిన మహిళ స్పిరిట్ ఎయిర్‌లైన్స్‌ విమానంలో లాస్ వేగాస్ నుంచి డల్లాస్‌కు వెళ్తుండగా మార్గమధ్యలోనే మృతిచెందింది. విమానం గాల్లో ఉండగానే ప్రయాణికురాలు స్పృహ‌త‌ప్పడంతో అల్బూక్వర్క్‌ విమానాశ్రయానికి పైలట్ అత్యవసరంగా మళ్లించారు.. అప్పటికే ఆమె చనిపోయిందని అల్బూక్వర్క్ ఎయిర్‌పోర్ట్ అధికార ప్రతినిధి స్టీఫెన్ కిట్స్ తెలిపారు.

అచేతనస్థితిలోకి వెళ్లిపోయిన ఆమెకు ఊపిరి ఆగిపోయిందని పోలీసు నివేదిక తెలిపింది. అచేతనవాస్థలో ఉన్న ప్రయాణికురాలికి క్యాబిన్ క్రూ సీపీఆర్ నిర్వహించడానికి ప్రయత్నించాడని పేర్కొంది. విమానం అత్యవసరంగా అల్బూక్వర్క్ విమానాశ్రయంలో దింపిన తర్వాత సిబ్బంది ఆమెను కాపాడటానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదని వివరించింది. మహిళ మరణం గురించి తొలిసారి వెల్లడించిన డల్లాస్ కౌంటీ జడ్జి కార్యాలయం.. ఆమెకు అనారోగ్య సమస్యలున్నట్టు తెలిపింది.

దర్యాప్తులో మాత్రం కోవిడ్-19 వల్లే ఆమె చనిపోయిందని, దీనికి ఆస్తమా, ఇతర అనారోగ్య కారణాలు కూడా దోహదపడ్డాయని తేలింది.ఎయిర్‌పోర్ట్ సిబ్బంది మాత్రం ఆమెకు కరోనా వైరస్ బారినపడ్డ విషయాన్ని గుర్తించలేకపోయారని, దీనిని సాధారణ అనారోగ్యంగా భావించారు. అయితే, డల్లాస్ కౌంటీ మాత్రం ఆమె కరోనాతో చనిపోయినట్టు ప్రకటించింది. ‘తీవ్రమైన అనారోగ్య పరిస్థితులతో అంతరాష్ట్ర ఎయిర్‌లైన్స్ విమానంలో ఆమె చనిపోయింది’అని తెలిపింది. మహిళ కుటుంబసభ్యులు, స్నేహితులకు స్పిరిట్ ఎయిర్‌లైన్స్ తమ ప్రగాఢ సానుభూతి తెలిపింది.