కోవిడ్‌-19 బారినపడ్డ దేశ రాజధాని

కోవిడ్‌-19 బారినపడ్డ దేశ రాజధాని

దేశ రాజధాని ఢిల్లీలో ఇప్పటివరకూ 23 శాతం మందికి పైగా కోవిడ్‌-19 బారినపడ్డారని ఓ అథ్యయనం వెల్లడించింది. ప్రభుత్వం నిర్వహించిన సెరో సర్వే ఫలితాలను మంగళవారం ప్రకటించారు. ఈ అథ్యయనం ప్రకారం 23.48 శాతం మంది ఢిల్లీ వాసుల్లో కోవిడ్‌-19 యాంటీబాడీలు ఉన్నాయని వెల్లడైంది. కరోనా మహమ్మారి ఆరు నెలల నుంచి ఢిల్లీ నగరంలో అన్ని ప్రాంతాలకూ, విస్తృత జనాభాకూ విస్తరించినా కేవలం 23.48 శాతం ఢిల్లీ ప్రజలే దీని బారినపడ్డారని, ప్రభుత్వం..పౌరుల సహకారంతో కోవిడ్‌-19 కట్టడి సాధ్యమైందని ఈ అథ్యయనంపై ప్రభుత్వం వ్యాఖ్యానించింది.

కరోనా సోకిన వారిలో అత్యధిక మందిలో ఎలాంటి లక్షణాలు లేవని అథ్యయనంలో వెల్లడైంది. ఢిల్లీ జనాభాలో అత్యధికులు ఇప్పటికీ వ్యాధి సోకే ముప్పున్న వారేనని, వ్యాధి కట్టడికి కఠిన చర్యలను ఇలాగే కొనసాగించాలని పేర్కొంది. భౌతిక దూరం పాటించడం, మాస్క్‌ ధరించడం, చేతులను శుభ్రపరుచుకోవడం, సమూహాలకు దూరంగా ఉండటం వంటి జాగ్రత్తలు విధిగా పాటించాలని సూచించింది. జూన్‌ 27 నుంచి జులై 10 వరకూ ఆరోగ్య మంత్రిత్వ శాఖకు చెందిన వ్యాధి నివారణ జాతీయ కేంద్రం (ఎన్‌సీడీసీ) ఈ అథ్యయనాన్ని చేపట్టింది.