కొనసాగుతున్న కరోనా వైరస్‌ ఉధృతి

కొనసాగుతున్న కరోనా వైరస్‌ ఉధృతి

గ్రేటర్‌లో కరోనా వైరస్‌ ఉధృతి కొనసాగుతూనే ఉంది. ఆదివారం 23 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అంబర్‌ పేట నియోజకవర్గం పరిధిలోలో నాలుగు పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, గోషామహల్‌ నియోజకవర్గం పరిధిలోని ధూల్‌పేట్‌ టక్కరివాడిలో మరో రెండు కేసులు నమోదయ్యాయి. ఇక ఎర్రగడ్డ ఛాతి ఆస్పత్రిలో ఐదుగురికి పాజిటివ్‌ వచ్చింది. దీంతో వారిని గాంధీకి తరలించారు. నెగిటివ్‌ వచ్చిన 16 మందిని డిశ్చార్జి చేశారు.

కొత్తగా మరో 35 మంది అనుమానితులు ఆస్పత్రిలో చేరారు. ఇక ఆయుర్వేద ఆస్పత్రిలోని పది మందికి పరీక్షలు నిర్వహించగా, వీరిలో ఏడుగురికి పాజిటివ్‌ వచ్చింది. దీంతో వారిని గాంధీకి తరలించారు. కొత్తగా మరో నలుగురు అనుమానితులు వచ్చారు. ఇక ఫీవర్‌ ఆస్పత్రిలో ఏడుగురు అనుమానితులు రాగా ఆస్పత్రిలో అడ్మిట్‌ చేసి, వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. చికిత్స పొందుతున్న వారిలో ఆదివారం ముగ్గురు మృతి చెందారు. దీంతో గ్రేటర్‌లో మృతుల సంఖ్య 47కు పెరిగింది.