అన్నమయ్య జిల్లా రాయచోటి సమీపంలో టోల్గేట్ సిబ్బందిపై వైకాపా నాయకులు దౌర్జన్యానికి పాల్పడ్డారు. రామాపురం మండలం బండపల్లి టోల్గేట్ వద్ద తమ వాహనానికి గేటును వెంటనే తీయలేదంటూ విచక్షణారహితంగా మూకుమ్మడి దాడి చేశారు.
లక్కిరెడ్డిపల్లె మండలం పాలెం గొల్లపల్లె ఎంపీటీసీ శ్రీలత భర్త శివశంకర్ నాయుడు తన అనుచరులతో కలిసి వాహనంలో మంగళవారం అర్ధరాత్రి టోల్గేట్ వద్దకు చేరుకున్నారు. అప్పటికే గేట్ పడగా, బిల్లు ఎంటర్ చేసి తెరిచే లోపు తన కారునే ఆపుతారా? అంటూ కౌంటర్లోని సిబ్బందిని బయటకు లాగి కొట్టారు. నానా దుర్భాషలాడారు. అడ్డొచ్చిన వారినీ తీవ్రంగా గాయపరిచి వెళ్లిపోయారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీఫుటేజ్లో రికార్డయ్యాయి. గాయపడిన వారిని పోలీసులు రాయచోటి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గతంలోనూ ఇదే విధంగా శివశంకర్ నాయుడు దాడి చేశారని బాధితులు రామాపురం ఠాణాలో ఫిర్యాదు చేశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.