ఇంటిని తాకిన విద్యుత్ మంటలు… సజీవ దహనం అయిన తల్లిబిడ్డలు

తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. విద్యుత్‌ తీగల నుంచి చెలరేగిన మంటల్లో తల్లి, ఏడాది కుమార్తె సజీవ దహనమయ్యారు. అయితే ఈ ఘటన జిల్లాలోని జక్రాన్‌పల్లి మండలం లక్ష్మాపూర్‌ గ్రామంలో తాజాగా చోటుచేసుకుంది.

అయితే ఈ గ్రామానికి చెందిన పడకంటి శ్రీనివాస్‌కు అనితతో కొన్నాళ్ల క్రితం పెళ్లైంది. వీరికి ఒక కుమారుడు శ్రీనిత్, ఒక కుమార్తె శ్రీనిత ఉన్నారు. శ్రీనివాస్ ఆటోడ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తుండే వాడు. బుధవారం సాయంత్రం అనిత ఇద్దరు పిల్లలతో కలిసి ఇంట్లో నిద్రపోతోంది. అదే సమయంలో షార్ట్‌సర్య్కూట్ జరిగి మంటలు చెలరేగాయి. ఈ విషయాన్ని అనిత గమనించేలోపలే ఆ మంటలు ఇంటిని చుట్టుముట్టాయి. అనిత కేకలు విన్న స్థానికులు వెంటనే అక్కడికి చేరుకుని వారిని రక్షించేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. కాగా శ్రీనిత్‌ను వారు కాపాడగా అనిత, శ్రీనిత, మంటల్లో చిక్కుకొని కళ్లెదుటే సజీవ దహనమయ్యారు. దీంతో గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది.