Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
కలియుగ దైవం వేంకటేశ్వరుణ్ని దర్శించుకుని ఎందరో భక్తులు తరిస్తుంటారు. తిరుమల వెంకన్న సన్నిధిలో నిల్చుని అద్వితీయ ఆనందం అనుభవిస్తారు. కోరిన కోర్కెలు తీర్చే దేవుణ్ని కొంగుబంగారంగా కొల్చుకుంటారు. స్వామివారి దర్శన భాగ్యం కోసం సుదూర ప్రాంతాల నుంచి తరలివస్తారు. పరమ పవిత్ర పుణ్యక్షేత్రంలో అడుగుపెట్టగానే జన్మ ధన్యమైందనుకుంటారు. శ్రీవారిని ఒక్కసారి దర్శిస్తే చాలు సకల పాపాలూ హరించుకుపోతాయని నమ్ముతారు.
అయితే శ్రీనివాసుడి దర్శనం కోసం సామాన్య భక్తులు పడే బాధలు అన్నీ ఇన్నీ కావు. సపరివార సకుటుంబ సమేతంగా తిరుమల తరలివచ్చే భక్తులు క్యూలైన్లలో గంటల తరబడి నిరీక్షిస్తే కానీ స్వామివారి దర్శన భాగ్యం దొరకదు. రద్దీ ఎక్కువగా ఉండే సమయాల్లో భక్తుల బాధలు వర్ణనాతీతం. ఓ పక్క సామాన్య భక్తులు దర్శనం కోసం అష్ట కష్టాలు పడుతోంటే… వీఐపీలు, వీవీఐపీలు మాత్రం దర్జాగా స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. ఈ తీరుపై డీఎంకె ఎంపీ కనిమొళి అభ్యంతరం వ్యక్తంచేశారు. దేవుడి ముందు అంతా సమానమే అని నీతులు చెబుతుంటారని… వాస్తవానికి డబ్బున్నవారే దేవుడి వద్దకు ప్రత్యేకదర్శనం ద్వారా వెళ్తున్నారని మండిపడ్డారు. డబ్బు లేని వారికి రోజుల పాటు పడిగాపులు తప్పవని విమర్శించారు. కోట్లాది రూపాయలు ఇచ్చే కోటీశ్వరులకే ఆయన దేవుడు అన్నారు. పేదవాడిని కాపాడలేని దేవుడు మనకెందుకని ఆమె అన్నారు. తన సొంత హుండీనే కాపాడుకోలేని దేవుడు భక్తులను ఎలా కాపాడతాడని ప్రశ్నించారు.