యూరప్‌ దేశాలలో మళ్ళీ మొదలైన వణుకు

యూరప్‌ దేశాలలో మళ్ళీ మొదలైన వణుకు

కరోనా మహమ్మారి సెకండ్‌ వేవ్‌ యూరప్‌ దేశాల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. ఆస్పత్రులన్నీ కరోనా రోగులతో కిటకిటలాడిపోతున్నాయి. కరోనా కట్టడికి పలు దేశాలు పూర్తి స్థాయి లాక్‌డౌన్‌ దిశగా అడుగులు వేస్తుంటే, మరికొన్ని దేశాలు పరిమితమైన ఆంక్షల్ని విధిస్తున్నాయి. ఫ్రాన్స్‌ నెల రోజుల పాటు దేశవ్యాప్త లాక్‌డౌన్‌ ప్రకటించింది. ఆ దేశ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్‌ మాక్రాన్‌ దేశంలో కరోనా కేసులు తీవ్రతరమవుతున్నాయని, దానికి తగ్గ స్థాయిలో ఆస్పత్రి సదుపాయాలు లేవని అన్నారు.

అందుకే లాక్‌డౌన్‌ మినహా తమ ముందు మరో మార్గం లేదన్నారు. తొలి దశలో వణికించిన కరోనా కంటే రెండోసారి మరింత ప్రమాదకరంగా కరోనా విజృంభిస్తోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో గురువారం నుంచి మొదలైన లాక్‌డౌన్‌ డిసెంబర్‌ 1 వరకు కొనసాగుతుంది. అయితే లాక్‌డౌన్‌ నిర్ణయంపై దేశంలోని వ్యాపారస్తుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

ఇక జర్మనీలో బార్లు, రెస్టారెంట్లు, జిమ్ములు, సినిమా థియేటర్లు మూసివేశారు. క్రీడల్ని ప్రేక్షకులు లేకుండానే నిర్వహించనున్నారు. బహిరంగ ప్రదేశాల్లో కూడా ఎక్కువ మంది గుమికూడకుండా ఆంక్షలు విధిస్తున్నట్టు జర్మనీ ఛాన్సలర్‌ ఏంజెలా మెర్కల్‌ ప్రకటించారు. గత పది రోజుల్లోనే జర్మనీలో ఆస్పత్రుల రోగుల సంఖ్య రెట్టింపైందని దేశంలో ఆరోగ్య సంక్షోభం రాకుండా ఉండాలంటే ఈ ఆంక్షలన్నీ తప్పనిసరని మెర్కల్‌ తెలిపారు.