గుంటూరులో దారుణ హత్య

గుంటూరులో దారుణ హత్య

గుంటూరులో దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న యువతి మూణ్నెళ్లకే హత్యకు గురైంది. తలపై గాయాలతో ఇంటి ముందు నిర్జీవంగా పడి ఉండడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. మంగళగిరి మండలం యర్రబాలెంలో ఈ ఘటన జరిగింది. గ్రామంలోని బేడబుడగ జంగాల కాలనీకి చెందిన గురవయ్య కూతురు వెంకటలక్ష్మి(19) అదే కాలనీకి చెందిన యాకయ్య ప్రేమించుకున్నారు. మూడు నెలల కిందట ఇద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు.

పెళ్లైన మూడు నెలలకే అనూహ్యంగా వెంకటలక్ష్మి దారుణ హత్యకు గురైంది. తలపై బలంగా మోది కిరాతకంగా చంపేశారు. ఆమె ఇంటి ఎదుటే వెంకటలక్ష్మి శవమై కనిపించింది. వివాహిత మృతదేహాన్ని గమనించిన కాలనీవాసులు వెంటనే ఆమె కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం అందించారు. మంగళగిరి రూరల్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. తలపై బలంగా కొట్టి చంపేసినట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.