ఆట ఇంకా ముగిసిపోలేదు

ఆట ఇంకా ముగిసిపోలేదు

చెన్నై తరఫున తన ఆట ఇంకా ముగిసిపోలేదని చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని వెల్లడించాడు. ఐపీఎల్‌లో తమ జట్టు చివరి లీగ్‌ మ్యాచ్‌కు ముందు పసుపు రంగు జెర్సీలో ఇదే ఆఖరి మ్యాచా అని అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ… ‘కచ్చితంగా కాదు’ అని స్పష్టం చేశాడు. సీజన్‌లో ఈ సారి జట్టు పేలవంగా ఆడటం, స్వయంగా ధోని విఫలం కావడంతో పాటు ప్రతీ మ్యాచ్‌ తర్వాత యువ ఆటగాళ్లకు సూచనలిస్తూ, అడిగినవారికి తన సంతకంతో జెర్సీలు ఇస్తూ ధోని కనిపించడంతో అతను మళ్లీ ఐపీఎల్‌ ఆడతాడా లేదా అనే విషయంపై అనుమానాలు పెరిగాయి. అయితే ఇప్పుడు అందరికీ ఎమ్మెస్‌ జవాబిచ్చేశాడు.

కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌తో ఆదివారం మ్యాచ్‌ ముగిసిన తర్వాత ఎంఎస్‌ ధోని మాట్లాడుతూ.. ‘మా ప్రయాణం కఠినంగా సాగింది. చాలా తప్పులు చేశాం. అయితే గత నాలుగు మ్యాచ్‌లలో మా ప్రదర్శన సంతృప్తినిచ్చింది. మరొక్క మ్యాచ్‌ గెలిస్తే క్వాలిఫై అయ్యేవాళ్లం. వచ్చే ఐపీఎల్‌కు వేలం ఉంటుందా లేదా అనేది బీసీసీఐ నిర్ణయించాల్సిన విషయం. అయితే మా జట్టు ప్రధాన ఆటగాళ్ల బృందంలో మార్పులు చేయాల్సిన అవసరం ఉంది. ఐపీఎల్‌ మొదలైనప్పుడు పదేళ్లు సాగేలా జట్టును రూపొందించాం. ఇప్పుడు కూడా రాబోయే పదేళ్ల కోసం సిద్ధం చేయాలి. వచ్చే తరానికి బాధ్యత అప్పగించాల్సిన సమయమిది. జెర్సీలు ఇవ్వడం వల్లే నేను రిటైర్‌ అవుతున్నానని అంతా భావించారేమోన’ని పేర్కొన్నాడు.