యువతిపై సామూహిక అత్యాచారం

యువతిపై సామూహిక అత్యాచారం

యువజంటను అడ్డగించి యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన కామాంధులకు న్యాయస్థానం జీవితఖైదు విధిస్తూ సోమవారం తీర్పు ఇచ్చింది. దోషులకు జైలు శిక్షతో పాటు రూ.20వేల చొప్పున జరిమానా విధించింది. హైదరాబాద్ శేరిలింగంపల్లి మండలం న్యూహఫీజ్‌పేట్‌ ఆదిత్యనగర్‌కు చెందిన షేక్‌ షౌకత్‌(35), మహ్మద్‌ ఖాలిద్‌ అలియాస్‌ అబ్బు(22), మహ్మద్‌ అఫ్రోజ్‌ అలియాస్‌ లాల్‌(20), అబ్దుల్‌ సల్మాన్‌ఖాన్‌ అలియాస్‌ రైడర్‌(20), షేక్‌ సల్మాన్‌(22), ముజాహిద్‌ఖాన్‌ అలియాస్‌ షారూఖ్‌(20), మరో బాలుడు(17) కలిసి 2019 జనవరి 19న రాత్రి 7 గంటల ప్రాంతంలో హఫీజ్‌పేట రైల్యే స్టేషన్‌ సమీపంలోని పొదల చాటున మద్యం తాగుతున్నారు.

ఆ సమయంలో అటుగా వెళ్తున్న యువజంటను వారంతా అటకాయించారు. యువకుడిపై దాడికి పాల్పడి యువతి(25)ని పొదల్లోకి లాక్కెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వారి ఆర్తనాదాలు విన్న స్థానికులు అక్కడికి చేరుకునేలోపే నిందితులు పరారయ్యారు. యువకుడి ఫిర్యాదు మేరకు మియాపూర్‌ పోలీసులు కేసు నమోదు చేసి మూడు రోజుల్లోనే నిందితులను పట్టుకుని కోర్టులో హాజరుపరిచారు. పూర్తి ఆధారాలతో అభియోగ పత్రం దాఖలు చేశారు.

కేసు విచారణలో ఉండగానే నిందితులు ఫిర్యాదుదారుడైన యువకుడిని బెదిరించడంతో అతడు మానసిక క్షోభకు గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీనిపై రాయదుర్గం పోలీసులు నిందితులపై మరో కేసు నమోదు చేశారు. అత్యాచారం కేసు విచారించిన రంగారెడ్డి జిల్లా ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక సెషన్స్‌ కోర్టు న్యాయమూర్తి జయలక్ష్మి ఆరుగురు నిందితులను దోషులుగా నిర్ధారించారు. వారందరికీ జీవిత ఖైదుతో పాటు రూ.20,000 చొప్పున జరిమానా విధిస్తూ తీర్పు చెప్పినట్లు అదనపు పీపీలు ప్రసాద్‌, ప్రతాప్‌రెడ్డి వెల్లడించారు. ఈ కేసులో భాగస్వామిగా ఉన్న బాలుడిపై విచారణ ఇంకా కొనసాగుతోందని వారు తెలిపారు.