కృష్ణా జిల్లాలో గ్యాంగ్‌రేప్.. ఫ్రెండ్స్‌తో కలిసి ఆటోడ్రైవర్ అమానుషం

Gangrape in Krishna district .. Autodriver brutality with friends

భర్త వదిలేయడంతో తల్లితో కలిసి ఉంటున్న మహిళపై కన్నేసిన ఆటోడ్రైవర్. షాపునకు రోజూ అతడి ఆటోలోనే వెళ్తుండటంతో ఆమెతో చనువు పెంచుకున్నాడు. ఓ రోజు దారి మరల్చి నలుగు ఫ్రెండ్స్‌తో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు.

ఈ దారుణ ఘటన విజయవాడలో చోటుచేసుకుంది. విజయవాడ వాంబేకాలనీకి చెందిన యువతి (23)ని భర్త వదిలేయడంతో తల్లితో కలిసి ఉంటోంది. రింగ్‌రోడ్డులో సమోసాలు తయారు చేసే ఓ కంపెనీలో పనిచేస్తోంది.

రోజూ సర్వీసు ఆటో ఎక్కి పనికి వెళ్తుండేది. ఈ నేపథ్యంలో ఆటోడ్రైవర్‌ వెంకటేష్‌ అలియాస్‌ వెంకీతో పరిచయం ఏర్పడింది. దీంతో రోజూ అతని ఆటోలోనే పనికి వెళ్లేది. మంగళవారం ఉదయం కంపెనీకి వెళ్లేందుకు ఆమె లెనిన్‌సెంటరుకు రాగా కొంచెం మాట్లాడాలని వెంకీ ఆమెను బందరు బీచ్‌కు ఆటోలో తీసుకెళ్లాడు.

అక్కడ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి తన కోరిక తీర్చాలని కోరాడు. దీనికి ఆమె నిరాకరించడంతో నిర్బంధించి తన నలుగురు ఫ్రెండ్స్‌కు ఫోన్ చేసి రప్పించాడు. వారంతా కలిసి ఆమె మీద సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

బాధితురాలికి సుమారు 8 గంటల పాటు నరకం చూపారు. తనను వదిలిపెట్టాలని ఆమె వేడుకున్నా కామాంధులు కనికరించలేదు. ఎట్టకేలకు మంగళవారం రాత్రి 9.30 గంటల సమయంలో బాధితురాలు తప్పించుకుని ఇంటికి చేరుకుంది.

కుమార్తె శరీరంపై గాయాలు చూసిన తల్లి ఏం జరిగిందని అడగగా ఆటోలో నుంచి పడిపోయానని చెప్పింది. బుధవారం ఉదయం లేచేసరికి కుమార్తె ఒళ్లు వేడిగా కాలిపోతుండటంతో ఏం జరిగిందో చెప్పాలని తల్లి నిలదీసింది.

దీంతో తనపై జరిగిన అఘాయిత్యాన్ని తల్లికి చెప్పింది. దీంతో ఆమె ఐద్వా మహిళా నేతలను ఆశ్రయించడంతో వారు బాధితురాలిని నున్న పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి ఫిర్యాదు చేయించారు.