అమీర్‌పేట్‌ మెట్రో స్టేషన్ మెట్ల దగ్గర యువతి మృతి

అమీర్‌పేట్‌ మెట్రో స్టేషన్ మెట్ల దగ్గర యువతి మృతి

హైదరాబాద్ అమీర్‌పేట్‌ మెట్రో స్టేషన్ మెట్ల దగ్గర పెచ్చులూడి మీద పడటంతో మహిళ చనిపోయింది. వర్షం కురుస్తుండటంతో మహిళ స్టేషన్ మెట్ల దగ్గర నిలబడింది. ఈలోపు రెయిలింగ్ ఒక్కసారి ఊడి ఆమెపై పడింది. తీవ్రంగా గాయపడిన ఆమెను హుటా హుటిన ఆస్పత్రికి తరలించారు.. అక్కడ చికిత్సపొందుతూ చనిపోయింది.

మృతురాలిని కేపీహెచ్‌బీకి చెందిన కంతాల మౌనికగా గుర్తించారు.. ఆమె బంధువులకు సమాచారం ఇచ్చారు. మౌనిక టీసీఎస్‌లో ఉద్యోగిగా పనిచేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న ఎస్సార్‌నగర్ పోలీసులు.. విచారణ చేపట్టారు. రెయిలింగ్ ఊడిపడటానికి కారణాలపై మెట్రో అధికారులు కూడా ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. నాణ్యతాపరమైన లోపమా.. వర్షం కారణంగా రెయిలింగ్ ఏదైనా దెబ్బతినిందా అన్న కోణంలో విచారణ ప్రారంభించారు.

మెట్రో రాకతో ట్రాఫిక్‌ బాధలు తప్పాయని ఊపిరి పీల్చుకున్న నగరవాసులు… ఇప్పుడు మెట్రో జర్నీ అంటేనే ప్రాణాలు అరచేతిలో పెట్టుకోని ప్రయాణం చేయాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.