సీఎం సీటు కోసం గోవాలో కాంగ్రెస్ రాజకీయం…!

Goa Congress To Acquire Cm Seat

అనారోగ్యం కారణంగా గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ విధులకు హాజరుకాకపోవడంతో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడానికి అక్కడి ప్రతిపక్ష కాంగ్రెస్ పావులు కదుపుతోంది. సభలో తమదే అతిపెద్ద మెజార్టీ పార్టీ అని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే హక్కు కూడా మాకే ఉందని ప్రస్తుత ప్రభుత్వాన్ని రద్దుచేసి తమకు అవకాశం కల్పించాలని కోరుతూ గోవా గవర్నర్‌కు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సోమవారం లేఖ రాయడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బీజేపీ ప్రభుత్వాన్ని రద్దుచేసి అతిపెద్ద మెజార్టీ పార్టీ అయిన తమనే కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని వారు డిమాండ్ చేశారు. ఆ పార్టీకి చెందిన 16 మంది ఎమ్మెల్యేలతో కూడిన లేఖను గవర్నర్ వ్యక్తిగత కార్యదర్శికి ప్రధాన ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ శాసనసభాపక్ష నాయకుడు బాబూ కవేల్కర్ అందజేశారు.

goa-cm

అయితే, శాసనసభను రద్దుచేయడాన్ని తాము అంగీకరించబోమని అందులో స్పష్టం చేశారు. మంగళవారం తమ ఎమ్మెల్యేలతో కలిసి గవర్నర్‌ను కలుస్తామని ఆయన వెల్లడించారు.ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ అనారోగ్యంతో రాష్ట్రంలో పాలన స్తంభించిందని, ఆయనకు ప్రత్యామ్నాయంగా మరో వ్యక్తిని సీఎంగా నియమించలేదని కవేల్కర్ ఆరోపించారు. గత కొంత కాలంగా క్లోమగ్రంధి కేన్సర్‌తో బాధపడుతోన్న గోవా సీఎం మనోహర్ పారికర్ అమెరికాలో చికిత్స తీసుకున్నారు. చికిత్స అనంతరం గోవాకు చేరుకున్న ఆయన మరోసారి అస్వస్థతకు గురయ్యారు. దీంతో ప్రస్తుతం ఆయన చికిత్స కోసం న్యూఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరారు. మొత్తం 40 స్థానాలు ఉన్న గోవా శాసనసభలో కాంగ్రెస్‌కు 16 మంది సభ్యులున్నారు. అయితే, కేవలం 14 స్థానాలు మాత్రమే గెలుచుకున్న బీజేపీ ఎంజీపీ 3, గోవా ఫార్వర్డ్ 3, ఎన్సీపీ 1, ముగ్గురు స్వతంత్రులతో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

goa-cm-modi