14 కేజీల బంగారం మాయం చేసిన ఇంటిదొంగ

14 కేజీల బంగారం మాయం చేసిన ఇంటిదొంగ

లాకర్‌లో ఉంచిన 14 కేజీల బంగారం మాయం కేసులో ఇంటిదొంగ చిక్కాడు. సీసీ కెమెరాల ఆధారంగా జ్యువెలరీస్‌ యజమాని సుభాష్‌ బోత్రా కుమారుడు హరిష్‌ బోత్రాను ఆదివారం అరెస్టు చేశారు. చెన్నై షావుకారుపేటలో రాజ్‌కుమార్, సుభాష్‌బోత్రా నిర్వహిస్తున్న జ్యువెలరీ షోరూమ్‌లో గత నెల 14 కేజీల బంగారం మాయమైన విషయం తెలిసిందే. ఇక్కడకు అధికంగా బంగారు ఆభరణాల తయారీ ఆర్డర్లు రావడం జరుగుతుండడంతో లాకర్‌లో ఉంచిన వివిధ డిజైన్లు మాయం కావడం ఆ యజమానుల్ని కలవరంలో పడేసింది.

వేసిన తలుపులు వేసినట్టుగానే ఉండడం, లాకర్‌కు ఉన్న లాక్‌ తెరుచుకోకుండానే ఆ నగలు ఎలా మాయమయ్యాయో అన్న ఆందోళన బయలుదేరింది. దీనిపై జ్యువలరీలో పనిచేస్తున్న వారందర్నీ విచారించి, చివరకు పోలీసుల్ని ఆశ్రయించారు. ఎలిఫెంట్‌ గేట్‌ పోలీసులు రెండు వారాల పాటు విచారించినా చిన్న ఆధారం కూడా చిక్కలేదు.

ఈ పరిస్థితుల్లో సుభాష్‌ బోత్ర కుమారుడు హరీష్‌బోత్రాపై దృష్టి పడింది. వారం రోజులకు పైగా తరచూ బయటకు అతడు వెళ్లి వస్తున్న దృశ్యాలు షావుకారు పేట పరిసరాల్లోని సీసీ కెమెరాలకు చిక్కాయి. దీంతో అతడ్ని అదుపులోకి తీసుకుని విచారించగా ఇంటిదొంగ పనే అని తేలింది. ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌లో తీవ్రంగా నష్టం చవిచూసిన హరీష్‌ , దానిని భర్తీ చేసుకునేందుక 14 కేజీల బంగారంపై కన్నేశాడు.

షోరూమ్, లాకర్‌ గురించి సమగ్రంగా తెలిసి ఉన్న దృష్ట్యా, తన తండ్రి వద్ద ఉన్న ఓ తాళం ఆధారంగా ఆ నగల్ని మాయం చేసి, రెండు కేజీలను షోరూమ్‌లోనే రహస్యంగా, మిగిలిన 12 కేజీలను మరో చోట దాచిపెట్టాడు. తాను కాజేసిన నగలు భద్రంగా ఉన్నాయా అని తెలుసుకునేందుకు తరచూ బయటకు వెళ్లి వచ్చి నిఘా నేత్రాల పుణ్యమా అడ్డంగా బుక్కయ్యాడు.