టీడీపీలో చేరనున్న వైసీపీ ఎమ్మెల్యే !

Gowru Charitha Reddy To Join In TDP

గత కొద్దిరోజులుగా వైసీపీ టీడీపీకి షాకుల మీద షాకులిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలువురు నేతలు టీడీపీని వీడి వైసీపీ గూటికి చేరారు. మరికొందరు చేరడానికి సిద్ధంగా ఉన్నారంటూ వార్తలు కూడా వచ్చాయి. అయితే ఇప్పుడు రివర్స్ ఇంజినీరింగ్ మొదలుపెట్టింది టీడీపీ. ఈసారి వైసీపీకి షాకిస్తూ ఓ ఎమ్మెల్యే టీడీపీలో చేరడానికి సిద్దమైనట్లు తెలుస్తోంది. కర్నూలు జిల్లా పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి, ఆమె భర్త గౌరు వెంకట్ రెడ్డి వైసీపీ తీరు పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారని త్వరలోనే వారు వైసీపీకి గుడ్ బై చెప్పే అవకాశముందని వార్తలొస్తున్నాయి. గత ఎన్నికల్లో వైసీపీ తరపున పాణ్యం నుంచి గౌరు చరితా రెడ్డి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.

అయితే ఆ తరువాత మాజీ కాంగ్రెస్ నేత ఆ తర్వాత బీజేపీ తీర్ధం పుచ్చుకున్న పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి వైసీపీలో చేరారు. అప్పటి నుంచి పార్టీలో తమకు ప్రాధాన్యత తగ్గిందని గౌరు దంపతులు అసంతృప్తితో ఉన్నారు. దీనికితోడు కాటసాని వచ్చే ఎన్నికల్లో పాణ్యం టికెట్ ఆశిస్తున్నారు. పాణ్యం టికెట్ కాటసానికి ఇచ్చే అవకాశముందని పార్టీ వర్గాల్లో కూడా చర్చ జరుగుతుంది. దీంతో గౌరు దంపతులు వైసీపీ వైఖరి పట్ల అసంతృప్తితో ఉన్నారని సమాచారం. పాణ్యం టికెట్‌ను మరోసారి గౌరు చరితా రెడ్డికి కేటాయించే విషయంలో వైఎస్ జగన్ స్పష్టమైన హామీ ఇవ్వలేదని అందుకే పాణ్యం టికెట్ తమకు రాదనే భావనలో ఉన్న గౌరు దంపతులు.. టీడీపీలో చేరే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనిలో నిజమెంతో తెలీదు కానీ అదే జరిగితే సంచలనంగా మారడం ఖాయం.