కొత్తగా ఒమిక్రాన్‌ కేసులు

కొత్తగా ఒమిక్రాన్‌ కేసులు

కరోనా వైరస్‌ కొత్తగా ఒమిక్రాన్‌ వేరియంట్‌ రూపంలో అలజడి సృష్టిస్తోంది. కొన్ని రోజుల క్రితం వరకు విదేశాలకే పరిమితమైన ఈ మహమ్మారి, ఇప్పుడు చాపకింద నీరులా దేశం మొత్తం విస్తరిస్తోంది. తాజాగా గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో మరో రెండు ఒమిక్రాన్‌ వేరియంట్‌ కరోనా వైరస్‌ కేసులు వెలుగు చూశాయి. దీంతో దేశంలో మొత్తం ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య 25కు చేరింది. డిసెంబర్‌ 4న జింబాబ్వే నుంచి భారత్‌ తిరిగొచ్చిన ఎన్నారై వ్యక్తికి కోవిడ్‌ కొత్త వేరియంట్‌ సోకగా.. ఇప్పటికే పాజిటివ్ వచ్చిన జింబాబ్వే వ్యక్తిని కలిసిన పది మందిని క్వారంటైన్ లో పెట్టారు. అతడితో పరిచయం ఉన్న వ్యక్తుల నుంచి నమూనాలు సేకరించి పరీక్షకు పంపారు.

ఈ నేపథ్యంలో శుక్రవారం ఆయన భార్య, బావమరిదికి పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం గుజరాత్‌లో మూడు ఓమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి. కాగా, ఈ ముగ్గురికి ఎలాంటి లక్షణాలు లేవని, ఆసుపత్రిలో అడ్మిట్‌ అయ్యారని, వారి ఆరోగ్యం స్థిరంగా ఉన్నదని జామ్‌నగర్‌ మున్సిపల్‌ కమిషనర్‌ విజయ్‌కుమార్‌ ఖరాడి తెలిపారు. ఇదిలా ఉండగా దేశంలో ఒమిక్రాన్‌ కేసుల మొత్తం సంఖ్య 25కు చేరింది. అత్యధికంగా మహారాష్ట్రలో 10, రాజస్థాన్‌లో 9, గుజరాత్‌లో ౩, కర్ణాటకలో 2, ఢిల్లీలో ఒకటి చొప్పున ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా భారత్‌తో సహా 57 దేశాలు ఈ కొత్త కరోనా వేరియంట్‌ బారినపడ్డాయి.

మరోవైపు ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో బూస్టర్ డోసుపైనా చర్చ జరుగుతోంది. అవసరముంటే బూస్టర్ డోస్ కూడా తీసుకోవచ్చని, అయితే, సెకండ్ డోసు తీసుకున్న 9 నెలల తర్వాతే తీసుకోవాలని ఆరోగ్యశాఖకు చెందిన ఓ ఉన్నతాధికారి చెప్పారు. ఇక గత 24 గంటల్లో 8,503 మందికి కోవిడ్‌ పాజిటివ్‌గా తేలగా.. మొత్తం కేసుల సంఖ్య 3,46,74,744 కు పెరిగింది. కొత్తగా 624 మంది మరణించగా మరణాల సంఖ్య 4,74,735కు చేరింది. ప్రస్తుతం దేశంలో 94,943 యాక్టివ్‌ కేసులున్నాయి.