సినీ నటుడు శివాజీ కేంద్ర ప్రభుత్వం మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను చెప్పిన ఆపరేషన్ గరుడను పేరు మార్చి మరో రూపంలో అమలుచేయబోతున్నారని ఆయన సంచలన విషయాలు బయట పెట్టారు. ఈ సోమవారం చంద్రబాబుకి కేంద్ర ప్రభుత్వం నోటీసులు రానున్నాయని ఆయన ప్రకటించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై బీజేపీ దాడి ప్రారంభమైందని కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండే ఓ జాతీయ స్థాయి రాజ్యాంగ సంస్థ నుంచి సోమవారం నాడు చంద్రబాబుకు నోటీసులు అందజేయబడతాయని ఆయన చెప్పారు. అయితే ఇప్పుడు ఈ విషయం బయట పడింది కాబట్టి నాలుగు రోజులు ఆలస్యమయినా నోటీసులు మాత్రం పక్కాగా పంపుతారని ఆయన చెప్పారు.
నిన్న అర్ధరాత్రి తనకు ఢిల్లీ నుంచి ఓ ఫోన్ కాల్ వచ్చిందని ఆ ఫోన్ ద్వారా తనకు ఈ విషయం తెలిసిందని చెప్పారు. ఇది అత్యంత విశ్వసనీయమైన వర్గాల నుంచి వచ్చిన సమాచారమని చెప్పారు. అలాగే తనకు కొన్ని రాజకీయ పార్టీల నుండి ప్రాణ హాని ఉందని ఆయన ఈ సందర్భంగా మీడియాకి వెల్లడించారు. ఒక ముఖ్యమంత్రిని టార్గెట్ గా చేసుకుని రాష్ట్రాన్ని ఇబ్బందులు పెట్టడం ముమ్మాటికీ భవిష్యత్ తరాలను నాశనం చేయడమేనని ఆయన బీజేపీ మీద తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. ఒక ముఖ్యమంత్రి వల్ల తమకు జాతీయ స్థాయిలో ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉందనే భావనతో ఆయన అడ్డుతొలగించేందుకు మరోసారి బీజేపీ పంజా విసురుతోందని మండిపడ్డారు. ఒకవేళ ఎవరైనా తప్పు చేసి ఉంటే వారిని శిక్షించేందుకు ఇంత సమయం తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని ఆయన ప్రశించారు. సమయం చూసి, దెబ్బతీసేందుకు యత్నించడం చాలా దుర్మార్గమని అన్నారు.