భార్యపై డంబెల్ తో దాడి

భార్యపై డంబెల్ తో దాడి

జిల్లాలోని కాకినాడ రూరల్ మండలం కొవ్వూరులో దారుణం చేసుకుంది. మద్యం మత్తులో కన్న పిల్లలతో కూడా అసభ్యకరంగా ప్రవర్తించాడో తండ్రి. కుమార్తెల ముందే అశ్లీల దృశ్యాలు చూస్తూ భార్యను, కూతుర్లను చిత్రహింసలకు గురిచేస్తున్నాడు. ఈ క్రమంలోనే నిలదీసిన భార్యపై డంబెల్‌తో దాడికి పాల్పడ్డాడు. భార్య మాధవి పోలీసులకు చేసిన ఫిర్యాదు వివరాల ప్రకారం.. ఏపీఎస్‌ ఆర్టీసీలో డ్రైవర్‌గా విధులు నిర్వర్తిస్తున్న భర్త దంగేటి శ్రీను గతకొంత కాలం నుంచి మద్యానికి బానిస అయ్యాడు. పుటుగా తాగి వచ్చి కుమార్తెల ముందే నీలి చిత్రాలు చూసేవాడు. భర్త తీరు నచ్చని భార్య మాధవి ఈ విషయంపై అనేకమార్లు భార్తతో వాగ్వాదానికి దిగింది. రెండు రోజుల క్రితం కూడా ఇలాంటి సీనే రిపీట్‌ అయ్యింది. ఈ క్రమంలోనే భార్యపై కోపంతో ఇంట్లో ఉన్న డంబెల్‌ తీసుకుని తలపై బలంగా కొట్టాడు.

అమ్మను కొట్టవద్దూ.. పోలీసులకు ఫిర్యాదు చేస్తాం అని పిల్లలు బతిలాడినా ఏమాత్రం పట్టించుకోకుండా దాడికి పాల్పడ్డాడు. ఈ దృశ్యాలను కుమార్తెలు ఫోన్‌లో రికార్డు చేయడంతో అవికాస్తా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. భర్త దాడి ఘటనలో తీవ్ర గాయాల పాలైన మాధవిని స్థానికుల సహాయంతో ఆస్పత్రికి తరలించి వైద్య చికిత్స అందించారు. అనంతరం తన భర్త నుంచి కుమార్తెలకు, తనకు ప్రాణహాని ఉందని స్థానిక ఇంద్రపాలెం పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అయితే గతంలోనూ భార్యా, పిల్లలు చిత్ర హింసలకు గురిచేస్తే పోలీసులకు భార్య ఫిర్యాదు చేసిందని, కేసు నమోదు అయితే ‌డ్రైవర్‌ఉద్యోగం పోతుందనే భయంతో ఫిర్యాదును ఉపసంహరించుకుంది. అప్పటి నుంచి వేదింపులు మరింత ఎక్కువయ్యాని బాధితురాలు తెలిపింది.