రైల్వే చరిత్రలో మర్చిపోలేని రోజులు: 167 ఏళ్లలో తొలిసారిగా ఇలా

ప్రపంచం అంతా కరోనా మహమ్మరి విజృంభిస్తున్న నేపధ్యంలో కరోనా వైరస్ ను నియంత్రించేందుకు ఇండియన్ రైల్వేస్ ఇంతకు ముందెన్నడూ లేని విధంగా సంచలన నిర్ణయం తీసుకుంది. పాసింజర్ ట్రైన్ సర్వీసులను మూడు వారాల పాటు నిలిపివేసింది. 167 ఏళ్ల రైల్వే చరిత్రలో ప్రయాణీకుల బండ్లన్నీ పట్టాలపైకి ఎక్కక పోవడం ఇదే తొలి సారి కావడం విశేషం. ఈ నేపథ్యంలో సుమారు 20 వేల పాత ట్రెయిన్ క్యారేజ్ ను కరోనా పేషెంట్ల కోసం ఐసోలేషన్ వార్డులుగా మార్చుతున్నారు.

కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడానికి ప్రధాని మోదీ ఈ నెల 14వరకు నేషనల్ లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో కమ్యూనిటీ స్ప్రెడ్ కాకుండా రైల్వే లైన్ లను నిలిపివేసింది. ఇండియన్ రైల్వేస్ ప్రపంచంలోనే నాలుగో పెద్ద నెట్ వర్క్ గా ఉండడమే కాక ఆసియాలో పెద్దది. దేశంలో ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్న ప్రభుత్వ సంస్థ. మొత్తం 16 జోన్లు ఉన్నాయి. రోజుకి 20,000పైగా పాసింజర్ ట్రైన్ లను లాంగ్ డిస్టెన్స్ సబర్బన్ రూట్లలో 7,349 స్టేషన్ ల ద్వారా 67,368 కిలోమీటర్ల మేర రాకపోకలు సాగిస్తాయి.

అయితే రైల్వేల ఆధ్వర్యంలో ఇప్పటికి 125 ఆసుపత్రులు ఉద్యోగులకు వైద్య సేవలు అందిస్తున్నాయి. ఆయా హాస్పిటల్స్ లోని డాక్టర్లు, నర్సులు ఇతర సిబ్బందితో కరోనా రోగుల కు ట్రీట్మెంట్ ఇప్పించాలని చూస్తున్నట్లు సమాచారం. కరోనా పేషెంట్లకు క్లీన్ శానిటైజర్, హైజినిక్ పరిస్ధితిలో సౌకర్యవంతంగా కోలుకొనేలా సేవలు అందిస్తామని రైల్వే మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు.

హాస్పిటల్ బెడ్లు, మెడికల్ ట్రాలీలు, మాస్క్ లు, శానిటైజర్ లు, వెంటిలేటర్ల వంటి మెడికల్ ఆపరేటర్స్ తయారీకి ఏ మేరకు అవకాశం ఉందో పరిశీలించాలని సూచించింది. పాసింజర్ రూట్లలో వినియోగించని నాన్ ఏసీ క్యారేజీలు గుర్తించి హాస్పిటల్స్ గా మార్చాలని ఎమర్జెన్సీ తలెత్తినప్పుడు వాడుకోవడానికి వీలుగా సిద్ధం చేయాలని రైల్వే అధికారులు ప్రభుత్వానికి మద్దతునిస్తున్నారు.