చనిపోయాడనుకొన్న బాలుడు లాక్ డౌన్ తో ఇంటికి.. తల్లిదండ్రులు షాక్

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఓ విచిత్రం జరిగింది. మూడేళ్ల క్రితం ఓ బాలుడు ఇంటి నుంచి తప్పిపోయాడు. ఐదారు రోజుల పాటు బాలుడి కోసం వెతికారు. ఆచూకీ దొరకలేదు. దీంతో అంతా ఇక లేరని అనుకున్నారు. ఆ తర్వాత కొన్ని రోజులకు ఊరి సమీపంలో ఉన్న అడవిలో ఓ అస్థిపంజరం కనిపించింది. అక్కడున్న గుడ్డ ముక్క తమ కుమారుడిదేనని భావించారు. దీంతో ఆ అస్థిపంజరానికి అంత్యక్రియలు నిర్వహించారు. అస్థికలను నదిలో కూడా కలిపారు. కానీ. ఆరోజు చనిపోయాడని భావించిన బాలుడు ఇప్పుడు కనిపించాడు. అది చూసిన తల్లిదండ్రులు షాక్ కి గురయ్యారు. తమ కుమారుడు ఇంటికి తిరిగొచ్చేసరికి వారికి మాటలు రావడం లేదు. ఆ బాలుడిని చూసి ఎంతో ఉద్వేగానికి లోనయ్యారు.

అయితే మధ్యప్రదేశ్‌ బుందేల్‌ఖాండ్‌లోని చత్తార్‌పూర్‌ గ్రామానికి చెందిన ఓ బాలుడు తనకు 12 ఏళ్ల వయసున్నప్పుడు ఇంటి నుంచి తప్పించుకు పోయాడు. తండ్రితో గొడవ పెట్టుకుని ఇంట్లో ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయాడు. కుమారుడు ఇంటికి తిరిగి రాకపోయేసరికి.. తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. బాలుడి ఆచూకీ కోసం వెతికారు. కానీ లాభం లేదు. చివరకు ఆ ఊరికి సమీపంలోని అడవిలో ఓ బాలుడి అస్థిపంజరం కనిపించడంతో తల్లిదండ్రులు కూడా అది మా అబ్బాయిదేనని అంతా అంత్యక్రియలు కూడా జరిపారు.

ఇప్పుడు అంతా షాక్ కి గురయ్యారు. లాక్ డౌన్ కారణంగా వలస కార్మికులు తమ సొంతూర్లకు వస్తున్న విషయం తెలిసిందే. దీంతో 12 ఏళ్ల వయసులో తప్పిపోయిన బాలుడు.. ఢిల్లీ నుంచి 600 కిలోమీటర్ల నడిచి.. సొంతూరుకు చేరుకున్నాడు. ఆ అబ్బాయి తన ఇంటికెళ్లి తలుపు కొట్టగా.. అతన్ని చూసిన తండ్రి ఆశ్చర్యపోయాడు. ఒక్కసారిగా షాక్‌కు గురై.. ఉద్వేగానికి లోనయ్యాడు. కుమారుడిని చూసిన తల్లిదండ్రులు ఆనందంతో ఉద్వేగానికి లోనయ్యారు. బాలుడి రాకతో ఆ గ్రామంలో సంబురాలు చేసుకున్నారు. అయితే మరి ఆ అస్థిపంజరం ఎవరిది? నాడు తప్పిపోయిన బాలుడు క్షేమంగా ఇంటికి తిరిగి రావడంతో.. ఆ అస్థిపంజరం ఎవరిదనే ప్రశ్నలు ఇప్పుడు అందరినీ వేధిస్తున్నాయి. ఈ కేసు పోలీసులకు సవాల్‌గా మారింది. మూడేళ్ల క్రితం కేసును మళ్లీ దర్యాప్తు చేస్తామని పోలీసులు చెప్తున్నారు.