పెద్ద బాధ్యత నెత్తికి ఎత్తుకోబోతున్న ఇంద్రగంటి

Indraganti Mohan Krishna to make Multistarrer movie

ఇప్పటి వరకు చిన్న చిత్రాలతో ప్రేక్షకులను మెప్పిస్తూ, విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంటూ వచ్చిన దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి త్వరలో మల్టీస్టారర్‌ చిత్రాన్ని చేసేందుకు సిద్దం అవుతున్నట్లుగా తెలుస్తోంది. కెరీర్‌లో ‘సమ్మోహనం’తో అతి పెద్ద కమర్షియల్‌ సక్సెస్‌ను దక్కించుకున్న ఇంద్రగంటి ప్రస్తుతం మల్టీస్టారర్‌ స్క్రిప్ట్‌ను సిద్దం చేస్తున్నాడు. ఇంద్రగంటి చెప్పిన స్టోరీలైన్‌ నచ్చడంతో దిల్‌రాజు ఈ చిత్రాన్ని నిర్మించేందుకు ముందుకు వచ్చాడు. స్వయంగా దిల్‌రాజు ఇద్దరు హీరోలను ఒప్పించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇద్దరు యువ హీరోలతో ఇంద్రగంటి మల్టీస్టారర్‌ చిత్రం ఉండబోతుందని తెలుస్తోంది.

ప్రస్తుతం వెంకటేష్‌ మరియు వరుణ్‌ తేజ్‌ల కాంబినేషన్‌లో అనీల్‌ రావిపూడి దర్శకత్వంలో ‘ఎఫ్‌ 2’ అనే మల్టీస్టారర్‌ చిత్రాన్ని నిర్మిస్తున్న దిల్‌రాజు తాజాగా మరో మల్టీస్టారర్‌కు బాట వేస్తున్నాడు. ఇంద్రగంటి దర్శకత్వంలో మల్టీస్టారర్‌ చిత్రం అంటే హీరోలు ఆసక్తి చూపించకపోవచ్చు. కాని దిల్‌రాజు ఈ ప్రాజెక్ట్‌లో ఎంటర్‌ అవ్వడంతో హీరోలు ఆసక్తి చూపించే అవకాశం ఉంది. ఈ మల్టీస్టారర్‌లో నటించబోతున్న హీరోలు ఎవరు అనే విషయంపై త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. దసరా తర్వాత మల్టీస్టారర్‌ చిత్రాన్ని సెట్స్‌పైకి తీసుకు వెళ్లాలని దిల్‌రాజు భావిస్తున్నాడు. వచ్చే ఏడాది సమ్మర్‌ కానుకగా ఈ మల్టీస్టారర్‌ చిత్రాన్ని విడుదల చేసే అవకాశం ఉంది. ఇప్పటి వరకు చిన్నా, చితకా చిత్రాలను మోసిన ఇంద్రగంటి మల్టీస్టారర్‌ చిత్రం అంటే భారీ అంచనాలుంటాయి, మరి ఆ అంచనాలను నెత్తికి ఎత్తుకుని మోయగలడా అనేది చూడాలి.