తెలివైన పని చేసిన ఐటీ గ్రిడ్స్ చైర్మన్ !

IT Grids Chairman Filed Quash Petition At High Court

ఏపీ, తెలంగాణ మధ్య రాజకీయ వివాదానికి కేంద్ర బిందువుగా మారిన డేటా చోరీ వివాదం మరో మలుపు తిరిగింది. ఈ వ్యవహారంలో ఐటీ గ్రిడ్స్ సంస్థపై ఇప్పటికే తెలంగాణ పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు వేగవంతం చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆ సంస్థ సీఈఓ అశోక్ దాకవరపు హైకోర్టును ఆశ్రయించారు. ఐటీ గ్రిడ్స్‌ సంస్థపై గత కొంతకాలంగా జరుపుతున్న విచారణను నిలిపివేయాలని, కేసును కొట్టివేయాలని క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఐటీ గ్రిడ్స్‌ సంస్థపై పోలీసులు కేసు నమోదు చేయగా, ఇటీవల తెలంగాణ ప్రభుత్వం సిట్‌ ఏర్పాటుచేసి విచారణ ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలో తనపై అక్రమంగా కేసులు బనాయించారని, ఈ కేసును పూర్తిగా కొట్టివేయాలని, అప్పటివరకు దీనిపై విచారణను నిలిపివేస్తూ స్టే ఇవ్వాలని అశోక్‌ కోరినట్టు చెబుతున్నారు. ఈ పిటిషన్‌ శనివారం లేదా సోమవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది. ఇందులో తెలంగాణ పోలీసులను ఆయన ప్రతివాదులుగా పేర్కొన్నారు. తాము ఎలాంటి డేటా దుర్వినియోగానికి పాల్పడలేదని, వ్యాపారపరమైన లావాదేవీలు మాత్రమే చేసినట్టు అశోక్‌ తన పిటిషన్‌లో పేర్కొన్నట్టు తెలుస్తోంది.