వ్యవసాయం, అనుబంధ రంగాలపై సమీక్ష

వ్యవసాయం, అనుబంధ రంగాలపై సమీక్ష

‘మన పాలన–మీ సూచన’ పేరుతో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న మేధోమథన సదస్సుల్లో భాగంగా మంగళవారం వ్యవసాయం, అనుబంధ రంగాలపై సమీక్ష జరిగింది. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అన్నారు. ‘రైతు, రైతు కూలీల్లో చిరునవ్వు చూడటమే మనలక్ష్యం. 3,648 కిలోమీటర్ల పాదయాత్రలో రైతుల కష్టాలను చూశా. రైతుల కష్టాలను తొలగించేలా మేనిఫెస్టో రూపొందించాం. పంటల సాగు ఖర్చు తగ్గించగలిగితే రైతులు లాభపడతారు.

ప్రకృతి వైపరిత్యాలు వచ్చినప్పుడు రైతులను ఎలా కాపాడుకోవాలో కూడా ఆలోచించాం. పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించినప్పుడే వ్యవసాయం లాభసాటిగా ఉంటుంది. ఈ మూడు ప్రధాన అంశాలుగా మన ప్రభుత్వం ముందుకెళ్తోంది. రాష్ట్రంలో 70 శాతం రైతులు హెక్టార్‌లోపు మాత్రమే ఉన్నారు. రైతు భరోసా – పీఎం కిసాన్‌ ద్వారా రూ.13500 పంటసాయం అందిస్తున్నాం. రూ.12500 ఇస్తామని మాట ఇచ్చినా.. రూ.13500లకు పెంచాం. నాలుగేళ్లకు బదులు ఐదేళ్లు రైతు భరోసా అందిస్తాం’ అని వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు. ఈ సదస్సుకు వ్యవసాయ, సహకార శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య సమన్వయ కార్యదర్శిగా వ్యవహరించారు.