ఆస్తి కోసం భార్యను అంత పని చేశాడా??

కేరళలోని ఓ వింత ఘటన చోటు చేసుకుంది. ఓ భర్త తన భార్యను పాములతో కరిపించి చంపించిన విషయం వెలుగులో వచ్చింది. అయితే ఈ ఘటన కేరళలోని కొల్లాంలో మే 6వ తేదీ జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాగా ఈ ఈ కేసులో నిందితుడు సూరజ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విషయంపై సరికొత్త విషయాలు వెలుగు చూస్తున్నయి. పక్కా ప్లాన్ తోటే భార్యను పాములతో కరిచి చంపించాడని పోలీసుల విచారణలో తేలిపోయింది.

అసలు విషయం ఏం జరిగింది అంటే.. సూరజ్‌ ఓ ప్రయివేటు బ్యాంకులో ఉద్యోగిగా పని చేస్తున్నాడు. అతనికి ఉత్తర అనే అమ్మాయితో రెండేండ్ల క్రితం పెళ్లైంది. వీరికి ఏడాది వయసున్న బాలుడు కూడా ఉన్నాడు. సూరజ్‌కు తన భార్య ఉత్తర ఆస్తి మీద కన్నుపడింది. దీంతో ఆమెను ఎలాగైనా.. చంపి ఆస్తిని తన పేర చేయించుకోవాలని కుట్ర పన్నాడు సూరజ్. దీంతో ఫిబ్రవరి నెలలో తన స్నేహితుడు సురేశ్‌ (పాములు పట్టే వ్యక్తి) వద్ద నుంచి రక్త పింజరను తీసుకొచ్చి ఇంట్లోని బెడ్‌రూంలో వదిలాడు. అయితే ఉత్తరను రక్త పింజర కాటేసినప్పటికీ ఆమె చనిపోలేదు. దీంతో ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించగా కోలుకుంది. కానీ సూరజ్‌ తన ప్రయత్నం మాత్రం వదలలేదు. మళ్లీ ఏప్రిల్‌ నెలలో సురేశ్‌ నుంచి కింగ్‌ కోబ్రాను పొందాడు సూరజ్‌. మే 6వ తేదీన ఉత్తర నిద్రిస్తున్న బెడ్‌రూంలో కోబ్రాను వదిలేశాడు. ఆ తర్వాత ఉత్తరను కోబ్రా కాటేయడంతో ప్రాణాలు విడిచింది.

ఆ తర్వాత 6వ తేదీ రాత్రంతా చనిపోయిన భార్య పక్కనే సూరజ్‌ ఉన్నాడు. మరుసటి రోజు ఉదయం ఏమి తెలియనట్లు తన భార్యను ఆస్పత్రికి తీసుకెళ్లాడు. ఆమెను పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్లు నిర్ధారించారు. కాగా ఉత్తరను రెండుసార్లు పాము కాటేయడంతో ఆమె తండ్రికి అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. తన భార్యను సూరజ్‌ ఆస్తి కోసం చంపాడని పోలీసుల తేల్చేశారు. అయితే ఈ లోపు తన భార్య ఉత్తరకు సంబంధించిన  బంగారం, నగలు వంటివన్నీ కాజేశాడు. ఇంకా పోలీసులు దీనిపై దర్యాప్తు చేస్తున్నారు.