శాసన మండలి రద్దును సమర్థించుకోవడానికి జగన్ కారణాలు

శాసన మండలి రద్దును సమర్థించుకోవడానికి జగన్ కారణాలు

తాను ఆగ మేఘాల మీద తీసుకు వచ్చిన రాజధాని తరలింపు బిల్లుని తాత్కాలికంగానే అయినా శాసన మండలి అడ్డుకోవడంతో, శాసనమండలిని పూర్తిగా రద్దు చేయాలనే నిర్ణయానికి వచ్చేశారు ముఖ్యమంత్రి జగన్. 1985లో ఎన్టీఆర్ రద్దు చేసిన శాసనమండలిని తిరిగి 2007 లో వైఎస్ రాజ శేఖర్రెడ్డి పునరుద్ధరించిన విషయం తెలిసిందే. అయితే తన తండ్రి పునరుద్ధరించిన శాసన మండలి, ప్రజల కు ఎందుకు పనికి రాదు అన్న అర్థం వచ్చేలా జగన్ మాట్లాడడం ప్రజలను విస్మయ పరిచింది. అసలు మన రాష్ట్రానికి శాసన మండలి అవసరమా అంటూ జగన్ ప్రశ్నించారు.

శాసన మండలి రద్దు ను సమర్థించుకోవడానికి జగన్ ప్రధానంగా రెండు కారణాలు చెబుతున్నారు. మొదటిది పేద రాష్ట్రమైన ఆంధ్ర ప్రదేశ్ కి శాసన మండలి కారణంగా అనవసరపు భారం పడుతుంది అన్నది ఆయన వాదన. ఇక రెండవ వాదన, శాసన సభలోనే చాలా మంది విద్యావంతులు ఉన్నారు కాబట్టి, ప్రత్యేకంగా విద్యావంతులు, పెద్దలకు ఉద్దేశించిన శాసన మండలి అక్కర్లేదు అన్నది జగన్ వాదన.

వైకాపా నేతలు చట్ట సభలో మాట్లాడుతూ, శాసన మండలి నిర్వహించడానికి సంవత్సరానికి దాదాపు 60 కోట్లు ఖర్చు అవుతుందని, పేద రాష్ట్రమైన ఆంధ్ర ప్రదేశ్ ఇంత భారం భరించ లేదని, కాబట్టి శాసన మండలి రద్దు చేయడం వల్ల ప్రజా ధనం మిగులుతుందని వాదించారు. అయితే ఈ వాదన పై సోషల్ మీడియా లో విపరీతమైన సెటైర్ లు పడ్డాయి. ముఖ్య మంత్రిగా ఉంటూ శుక్ర వారం కోర్టుకు హాజరు కావడానికి ప్రజాధనాన్ని అధికారికంగా వినియోగించుకుంటూ దాదాపు గా వారానికి 60 లక్షలు జగన్ ప్రజాధనాన్ని ఖర్చు చేస్తున్నారని, అంటే సంవత్సరానికి దాదాపు 30 కోట్ల దాకా జగన్ కోర్టు కి రాను పోను ఛార్జీల కు ఖర్చు పెడుతున్నారని నెటిజన్లు గుర్తు చేస్తున్నారు.

60 కోట్లు నిర్వహణ ఖర్చు అవుతుందని శాసన మండలి ని రద్దు చేయడం సమంజసం అయితే, ఏడాది కి 30 కోట్లు ప్రజా ధనాన్ని ఈ విధంగా వృధా చేస్తున్న ముఖ్య మంత్రి ని ఇదే లాజిక్ ప్రకారం వెళితే ఏం చేయాలో ప్రజలు నిర్ణయించుకుంటారని సోషల్ మీడియాలో కౌంటర్ లు ఇస్తున్నారు నెటిజన్లు. నిజం గా ప్రజా ధనాన్ని వృధా కాకుండా ఆపాలి అనుకుంటే, జగన్ ఇంటి కిటికీ ల మరమ్మత్తుల ఖర్చులు, తలుపుల మరమ్మతుల ఖర్చులు అంటూ జీవోలు జారీ చేసి మరీ ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేయడం ఆపి వేస్తే బాగుంటుందని వారు సూచిస్తున్నారు.

రాజ్యాంగ కర్తలు ఒక ప్రత్యేక ఉద్దేశంతోనే రాజ్య సభ, శాసన మండలి వంటి ఎగువ సభల ఏర్పాటు కి అవకాశం కల్పించారు. దిగువ సభ లు అయిన లోక్ సభ, అసెంబ్లీ వంటివి సాధారణంగా అధికార పార్టీ మెజారిటీ తో నిండిపోయి ఉంటాయి కాబట్టి, వారు కొన్ని సార్లు నియంతృత్వ పోకడలకు పోయి విపరీత నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి, అలాంటి నిర్ణయాలను కనీసం తాత్కాలికంగానే అయినా అడ్డుకోవడం కోసం ఇటువంటి ఎగువ సభ ల ఏర్పాటు కు అవకాశం కల్పించారు రాజ్యాంగ కర్తలు. ఈ ఎగువ సభలో, తాత్కాలికంగానే అయినప్పటికీ, విపరీతమైన బిల్లులను ఆపడం ద్వారా ప్రజల లో అటు వంటి బిల్లుల పై చర్చ జరిగేలా చేయగలుగుతాయి ఈ ఎగువ సభ లు. మొత్తాని కి శాసన మండలి రద్దు విషయం లో జగన్ చేస్తున్న వాదనలు మరీ అడ్డ గోలు గా ఉన్నాయి అంటూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.