కోల్‌కతాలో ఘోరం… మహిళ పై జవాన్ తూటా

కరోనా వైరస్ దేశాన్ని అల్లాడిస్తుంది. ప్రజలకు నిద్రలేకుండా వణికించేస్తుంది. దీంతో లాక్ డౌన్ ప్రకటించి పకడ్బంధీగా అమలు చేస్తుంది కేంద్రం. రాష్ట్రాలు అందుకు సహకరిస్తున్నాయి. ఇదే సమయంలో కోల్‌కతాలో దారుణం చోటుచేసుకుంది.

అసలేం జరిగిందంటే.. లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘించిన వారి లిస్ట్ లో తన పేరు చేర్చడంపై జవాన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో జవాన్ యువతిని దారుణంగా కాల్చి చంపేశాడు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్‌లో వెలుగుచూసింది. లాక్‌డౌన్ కారణంగా.. ఎక్కడి వారు అక్కడే ఉండాలని నిబంధనలు అమల్లో ఉన్నాయి. అయితే కొందరు ఈ నిబంధనలను ఉల్లంఘించి తమ సొంతూర్లకు చేరుకుంటున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారి ద్వారా కరోనా వైరస్ సోకే ప్రమాదం ఉందన్న హెచ్చరికలతో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారి వివరాలను అధికారులు సేకరిస్తున్నారు.

అయితే యూపీలోని మణిపురి ఏరియాలో అల్లీపూర్ గ్రామంలోకి ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారి వివరాలు సేకరించే పనిని వివేక్ యాదవ్ అనే యువకుడికి అప్పగించారు గ్రామస్థులు. వివేక్, అతని మరదలు సంధ్య యాదవ్ కలసి ఇతర రాష్ట్రాల నుంచి సొంతూర్లకు వచ్చిన వారి వివరాలతో లిస్ట్ రూపొందించారు. ఆ లిస్ట్ ను స్థానిక అధికారులకు అందించారు. గ్రామానికి వచ్చిన ఆరోగ్య శాఖ, ఇతర అధికారులు జాబితాలో ఉన్న వారందరికీ వైద్య పరీక్షలు నిర్వహించారు.

అయితే ఈ లిస్ట్ లో ఆర్మీ జవాన్ శైలేంద్ర పేరు ఉంది. అతను కోల్‌కతా నుంచి సొంతూరు అల్లీపూర్ వచ్చాడు. తన పేరును ఆ లిస్ట్ లో ఎందుకు చేర్చావంటూ… వివేక్ యాదవ్‌తో జవాన్ శైలేంద్ర ఘర్షనకు దిగాడు. ఆ వెంటనే వివేక్ మరదలు సంధ్య యాదవ్ కూడా వచ్చింది. దీంతో ఆగ్రహం చెందిన శైలేంద్ర తుపాకీతో ఆమెపై కాల్పులు జరిపాడు. శరీరంలో నుంచి బుల్లెట్లు దూసుకు పోవడంతో సంధ్య అక్కడికక్కడే మృతి చెందింది. కాగా సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. నిందితుడు శైలేంద్రని పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.