జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా ప్రమాణ స్వీకారం

ఏపీ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా ప్రమాణ స్వీకారం చేశారు. జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రాతో గవర్నర్‌ బిశ్వభూషన్‌ ప్రమాణ స్వీకారం చేయించారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన సీజే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హాజరయ్యారు. అలాగే మంత్రులు బొత్స సత్యనారాయణ, వెల్లంపల్లి శ్రీనివాస్, పలువురు ఎమ్మెల్యేలు , హైకోర్టు న్యాయవాదులు హాజరయ్యారు.

కాగా.. ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ప్రధాన న్యాయ మూర్తిగా నియమితులైన జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా 1964 ఆగస్టు 29న ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌గడ్‌లో జన్మించారు. బిలాస్‌పూర్‌ లోని గురు ఘాసిదాస్‌ వర్సిటీ నుంచి బీఎస్సీ, ఎల్‌ఎల్‌బీ పట్టాలు పొందారు. 1987, సెప్టెంబర్‌ 4న న్యాయవాదిగా పేరు నమోదు చేయించుకొని రాయ్‌గఢ్‌లోని జిల్లా కోర్టు, జబల్‌పూర్‌లోని మధ్యప్రదేశ్‌ హైకోర్టు, బిలాస్‌పూర్‌లోని ఛత్తీస్‌గఢ్‌ హైకోర్టుల్లో ప్రాక్టీస్‌ చేశారు. ఛత్తీస్‌గఢ్‌ బార్‌ కౌన్సిల్‌కు చైర్మన్‌గా పనిచేశారు.

2004, జూన్‌ 26 నుంచి 2007, ఆగస్టు 31 వరకూ రాష్ట్ర అదనపు అడ్వొకేట్‌ జనరల్‌గా పనిచేశారు. 2007, సెప్టెంబర్‌ 1 వరకూ అడ్వొకేట్‌ జనరల్‌గా కొనసాగారు. 2009, డిసెంబర్‌ 10న ఛత్తీస్‌గఢ్‌ న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ప్రస్తుతం అక్కడ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి హోదాలో ఉన్న ఆయన.. తాజాగా ఏపీ హైకోర్టు సీజేగా నియమితులయ్యారు.