నాగబాబు ఘాటు సమాధానం

నాగబాబు ఘాటు సమాధానం

మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ ఎన్నికలు ముగిశాయి. ప్రకాశ్‌ రాజ్‌పై మంచు విష్ణు విజయం సాధించారు. అయిన ఎన్నికల వేడి ఇంకా తగ్గలేదు. రాజీనామాలు, ఆరోపణలతో మరింత వేడెక్కుతున్నాయి. ఈ క్రమంలో మీడియా సమావేశంలో పాల్గొన్న సీనియర్‌ నటుడు నరేశ్‌ మెగాస్టార్‌ చిరంజీవిపై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం విధితమే. ఈ నేపథ్యంలో రాజీనామా అనంతరం తొలిసారి మీడియాతో ముచ్చటించిన మెగా బ్రదర్‌ నాగబాబు, నరేశ్‌ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించాడు. సినీ పరిశ్రమకు పెద్దగా వ్యవహరించాలని తన అన్నయ్య ఎప్పుడు అనుకోలేదన్నాడు. పరిశ్రమకు చెందిన నటీనటులు, అభిమానులు ఎవరైనా కష్టమంటు ఇంటికి వస్తే ఆయన వారికి చేతనైనంత సాయం చేశారని పేర్కొన్నాడు.

అంతే తప్ప పెదరాయుడిలా సింహాసనంపై కూర్చొని పెద్దరికం చలాయిస్తానని ఎప్పుడు ఆయన అనలేదని, అన్నయ్యకు అంత అహంకారం లేదని నాగబాబు ఘాటుగా సమాధానం ఇచ్చాడు. అనంతరం తన రాజీనామాపై మాట్లాడుతూ.. ‘‘మా’ అసోసియేషన్‌లో సభ్యుడిగా ఉన్నందుకు ఎంతో గర్వపడ్డాను. తెలుగువాళ్లకు ప్రాంతీయవాదం ఉండదని, విశాల హృదయంతో వ్యవహరిస్తారనుకున్న. కానీ ఫలితాలు చూసి ఆశ్చర్యపోయాను. ఇలాంటి సంకుచితమైన అసోసియేషన్‌లో ఉండాలనిపించలేదు. మనస్థాపంతో బయటకు వచ్చేశాను. సభ్యత్వానికి రాజీనామా చేశాను. ఇకపై ఈ అసోసియేషన్‌తో నాకు సంబంధం ఉండదు’ అని ఆయన స్పష్టం చేశారు. కాగా ‘మా’ ఎన్నికల ఫలితాల అనంతరం విష్ణుతో కలిసి నరేశ్‌ మీడియా ముందుకు వచ్చాడు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దివంగత దర్శకుడు దాసరి నారాయణరావు ప్రస్థావన తీసుకొచ్చాడు. ఈ మేరకు పెద్దాయన చనిపోయిన అనంతరం ఆ స్థానం అలాగే ఉండిపోయిందని, చాలా మంది ఆ స్థానం కోసం ప్రయత్నించినా కూడా ఎవరికీ దక్కలేదన్నాడు. ఇప్పుడు ఆయన స్థానాన్ని భర్త చేసే ఆర్హత మోహన్‌ బాబు ఉందని, ఒకవేళ దాసరి గారు ఉన్నప్పటికి ఈ రోజు మోహన్‌ బాబుకు ఆ బాధ్యతలు ఇచ్చేవారన్నాడు. దీంతో పాటు ఇండస్ట్రీలో చిరంజీవి మాత్రమే కాదని ఇంకా చాలా మంది పెద్దలు ఉన్నారన్నాడు. అన్నింటికీ చిరంజీవి ఒక్కడే పెద్ద అనడం సరైనది కాదంటూ నరేశ్‌ వ్యాఖ్యానించాడు.