కుమారుడిని నెంబర్ వన్ స్ధానానికి తీసుకురావాలన్నది కేసీఆర్ ఆలోచన

కుమారుడిని నెంబర్ వన్ స్ధానానికి తీసుకురావాలన్నది కేసీఆర్ ఆలోచన

తెలంగాణ ప్రభుత్వంలో రెండోస్థానంలో ఉన్న ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు మెల్లిగా మొదటి స్థానానికి చేరుకుంటున్నారు. ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు ఇన్నాళ్లూ అటు పార్టీలోను, ఇటు ప్రభుత్వంలోనూ కూడా నెంబర్ వన్ గానే ఉన్నారు. ఒక్కో పదవిని కట్టబెడుతూ కుమారుడ్ని నెంబర్ వన్ స్ధానానికి తీసుకురావాలన్నది కేసీఆర్ ఆలోచనగా చెబుతున్నారు. ఇందులో భాగంగా కేటీఆర్ ను ఒక్కో మెట్టు ఎక్కిస్తున్న కేసీఆర్ తాజాగా కీలకమైన నామినేటెడ్ పదవులతో పాటు ఇతర అన్ని పదవుల పందారాన్ని కుమారుడికే అప్పగించాలని నిర్ణయించినట్లు చెబుతున్నారు. సోమవారం నాడు జరిగిన కేసీఆర్ పుట్టిన రోజు వేడుకల్లో ఈ విషయం సుస్పష్టమైందని పార్టీ నాయకులు చెబుతున్నారు.

ఈ వేడుకలన్నీ కేటీఆర్ కనుసన్నల్లోనే జరిగాయని, ఎవరెవరు ఎప్పుడు కలవాలని, ఎక్కడ ఎలాంటి వేడుకలు నిర్వహించాలన్నవి కేటీఆర్ ఆదేశాల మేరకే నిర్వహించినట్లు చెబుతున్నారు. ఇటీవల జరిగిన స్ధానిక సంస్ధల ఎన్నికల్లో కేటీఆర్ తన వారికే మేయర్లు, చైర్మన్లు, చివరికి స్పర్సంచ్ పదవులు వచ్చేలా చేశారు. క్షేత్రస్ధాయి నుంచి తన వారికి అవకాశాలు ఇస్తూ భవిష్యత్ లో ఎటు వైపు నుంచి ఇబ్బందులు రాకుండా వ్యూహాత్మకంగా పని చేస్తున్నారని అంటున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు కూడా ఏ పదవిని ఎవరికి కట్టబెట్టాలన్న అంశంపై తనయుడు కేటీఆర్ తో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారని, ఆయన వద్దు… కాదు అన్న వారిని పక్కన పెడుతున్నారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ఇటీవల సమాచార కమిషనర్ లు గా నియమితులైన ఐదుగురు కూడా కేటీఆర్ నిర్ణయించిన వారేనని చెబుతున్నారు. “సమాచార కమిషనర్లలో ఒకరిద్దరి పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ అంత సుయుఖంగా లేరు. అయినా కేటీఆర్ వారివైపే మెగ్గు చూపడంతో వారికే ఈ పదవులు వారికే దక్కాయి” అని పేరు వెల్లడించేందుకు ఇష్టపడని సీనియర్ నాయకుడొకరు చెప్పారు. భవిష్యత్ లో ఇక పదవి ఎవరికి ఇవ్వాలన్నా అది కేటీఆర్ దయాదాక్షిణ్యాలపైనే ఆధార పడి ఉంటుందని అంటున్నారు. ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు కూడా ఈ పుట్టిన రోజు నుంచి ముందుగా పలు బాధ్యతలు అప్పగించడం, ఆ తర్వాత ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోపెడతారని చెబుతున్నారు. ఈ విషయం అర్ధం చేసుకున్న చోటామోటా నాయకులతో పాటు సీనియర్ నాయకులు కూడా కేటీఆర్ ఇంటి వైపే పరుగులు తీస్తున్నారు.