తెలంగాణ నూతన మంత్రులకు సీఎం కేసీఆర్ షాకిచ్చారట. మంత్రులకు వ్యక్తిగత కార్యదర్శులను నియమించుకునే వెసులుబాటు లేకుండా వారిని నియమించే బాధ్యతను సీఎం కేసీఆరే తీసుకున్నారు. సాధారణంగా మంత్రులు శాఖాపరమైన నిర్ణయాలు, సలహాలు తీసుకోవడానికి తమకు నచ్చిన అధికారులను వ్యక్తిగత సిబ్బందిగా నియమించుకునేవారు. అది సంప్రదాయంగా వస్తోందే, మంత్రులకు విధుల్లో సహాయకారులుగా ఉంటూ వారికి దిశానిర్దేశం చేసే బాధ్యత పీఎస్లదే. మంత్రులు ఫైలుపై సంతకం చేయాలన్నా విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాలన్నా.. పీఎస్ల సలహాలు తప్పనిసరి. అయితే గత కేబినెట్ లో మంత్రుల వద్ద పీఎస్ లుగా పనిచేసిన అధికారులు అవినీతికి పాల్పడినట్లు సీఎం దృష్టికి వెళ్లింది.
ఈ కారణంగానే కొంతమంది మంత్రులకు చెడ్డపేరు వచ్చినట్లు కేసీఆర్ గుర్తించారు. అందుకే తాజాగా మంత్రలకు ఆ అవకాశం ఇవ్వకుండా స్వయంగా సీఎం కేసీఆరే వారి పీఎస్ లను నియమించనున్నారు. అందువల్ల ఇలాంటి తప్పు మరోసారి జరగకుండా చూడాలని భావించారు. ఈ క్రమంలో మంత్రుల పీఎస్ లను తానే నియమించాలని కేసీఆర్ భావించినట్లు సమాచారం. ఇక పీఏల ఎంపిక మాత్రం మంత్రుల ఇష్టానికే వదిలేశారట. ప్రతి మంత్రికీ ఒక పీఎస్, ఇద్దరు పీఏలను ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే మంత్రి పేషీ అంతా పీఎస్ ఆధీనంలోనే ఉంటుంది. ఈ క్రమంలో పక్కదారి పట్టిన పీఎస్ ల వల్లే మంత్రులు బద్నాం అవుతున్నారని గుర్తించిన సీఎం పీఎస్ల ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తున్నారని వార్తలు వస్తున్నాయి.