‘కేజీఎఫ్’ చాప్టర్-2 కోసం ఎదురు చూస్తున్న ప్రేక్షకులు

‘కేజీఎఫ్’ చాప్టర్-2 కోసం ఎదురు చూస్తున్న ప్రేక్షకులు

‘బాహుబలి’ తర్వాత ఆ స్థాయిలో భారతీయ ప్రేక్షకులు అమితాసక్తితో ఎదురు చూస్తున్న సినిమా అంటే ‘కేజీఎఫ్’యే. రెండేళ్ల కిందట ఈ చిత్రం భారతీయ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సంచలనాలు నమోదు చేసిందో తెలిసిందే. ఓ కన్నడ సినిమా ఇతర భాషల్లో రిలీజవడమే గొప్ప అనుకున్న రోజుల్లో.. తెలుగు, హిందీ, తమిళం, మలయాళ భాషల్లో ఆ సినిమా అదిరిపోయే వసూళ్లు రాబట్టి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.

ఇక అప్పట్నుంచి ‘కేజీఎఫ్’ చాప్టర్-2 కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు ప్రేక్షకులు. కరోనా లేకుంటే ఈ దసరాకే ‘కేజీఎఫ్-2’ రిలీజయ్యేది. ఐతే కరోనా విరామం తర్వాత సాధ్యమైనంత త్వరగా సినిమాను పూర్తి చేసే పనిలో పడింది చిత్ర బృందం. చిత్రీకరణ దాదాపు పూర్తి కావచ్చినట్లే అంటున్నారు. ఐతే రిలీజ్ ఎప్పుడో తెలియకపోయినా.. కనీసం టీజర్ అయినా విడుదల చేయాలని ఈ సినిమా అభిమానులు కోరుకుంటున్నారు.

ఇదిగో అదిగో అంటున్నారే తప్ప టీజర్ డేట్ ఇప్పటిదాకా చెప్పలేదు. ఐతే ఎట్టకేలకు ఆ విషయంలో నిర్మాత కార్తీక్ గౌడ స్పష్టత ఇచ్చాడు. ఓ అభిమాని ‘కేజీఎఫ్-2’ టీజర్ గురించి ట్విట్టర్లో నిలదీయగా.. జనవరి 8న యశ్ పుట్టిన రోజు కానుకగా టీజర్ రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించాడు. ఈ ఏడాది జనవరి 8న యశ్ పుట్టిన రోజుకే ఆ సినిమా ఫస్ట్ లుక్ లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఇంకో ఏడాదికి టీజర్ రాబోతుందన్నమాట. పరిస్థితులు అనుకూలిస్తే వేసవిలో ఈ సినిమా రిలీజయ్యే అవకాశముంది.

ఇక కేజీఎఫ్-2 కథ విషయానికి వస్తే గరుడను చంపాక కేజీఎఫ్‌ను తన సొంతం చేసుకున్న రాకీకి.. అధీర (సంజయ్ దత్) నుంచి సవాలు ఎదురవుతుంది. అతడితో పోరాడి గెలిచాక రాకీకి అసలు ఎదురే ఉండదు. ఐతే అతడి ఆధిపత్యాన్ని సహించలేక ప్రధాని (రవీనా టాండన్) అతణ్ని టార్గెట్ చేస్తుందట. ముందు ప్రభుత్వాన్ని గడగడలాడించిన రాకీ.. చివరికి కేజీఎఫ్ సింహాసనం మీద సగర్వంగా ప్రాణాలు వదులుతాడట. ఇదీ ప్రచారంలో ఉన్న ‘కేజీఎఫ్-2’ కథ.