జగన్‌మోహన్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు

జగన్‌మోహన్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు

ప్లాన్‌ ప్రకారమే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని మంత్రి కొడాలి నాని విమర్శించారు. సీఎం జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే తాటా తీస్తామని హెచ్చరించారు. పట్టాభి కూడా డబ్బులు తీసుకొని తిడుతున్నాడన్నారు. వైఎస్సార్సీపీ శ్రేణులను కావాలనే రెచ్చగొట్టారని మండిపడ్డారు. చంద్రబాబువి మొదటి నుంచి మోసపూరిత రాజకీయాలే అని దుయ్యబట్టారు. చంద్రబాబులాంటి వాళ్లు ఎంతమంది వచ్చినా ఏం కాదని, సీఎం వైఎస్‌ జగన్‌ను ఇంచు కూడా చంద్రబాబు కదపలేరని స్పష్టం చేశారు.

చంద్రబాబులా పెయిడ్‌ ఆర్టిస్ట్‌లను పెట్టి తిట్టించడం తమకు రాదని మంత్రి కొడాలి నాని స్పష్టం చేశారు. వ్యూహం ప్రకారమే డ్రగ్స్‌పై టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. అమిత్‌షాపై తిరుపతిలో చంద్రబాబు రాళ్లతో దాడి చేయించారని, చంద్రబాబు ఎలాంటి వ్యక్తో అమిత్‌షా, మోదీలకు ఎప్పుడో తెలుసన్నారు. ఇప్పుడు ఏం ముఖం పెట్టుకొని అమిత్‌షాను కలుస్తావని ప్రశ్నించారు. చంద్రబాబు చేసేవన్నీ నీచ రాజకీయాలేనని, ఆయన చేసే కొంగ జపాలను ఎవరూ నమ్మరని అన్నారు.

‘ఏపీలో ఏదో జరిగిపోతోంది. శాంతిభద్రతలు లేవు. దేశానికి మాదకద్రవ్యాలను సీఎం జగన్‌ సప్లై చేస్తున్నాడనే ప్రచారం కోసం టీడీపీ ప్రయత్నం చేసింది. టీడీపీ నాయకులు గత 10 రోజుల నుంచి తాడేపల్లి నుంచి గంజాయి వైఎస్‌ జగన్ ప్రపంచానికి సరఫరా చేస్తున్నాడంటూ పిచ్చి వాగుడు వాగుతున్నారు. రాజశేఖర్ రెడ్డిని ముఠా నాయకుడని, అవినీతిపరుడని అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టాలని చంద్రబాబు ప్రయత్నం చేశారు. వైఎస్‌ జగన్ నూనూగు మీసాల వయసు నుంచి ఆయనపై కుట్రలు చేయడం ప్రారంభించారు. ఈ రోజు అత్యధిక మెజారిటీతో గెలిస్తే ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. ఎవరెన్నీ చేసినా ప్రజల గుండెల్లో గుడి కట్టుకున్న జగన్‌మోహన్‌రెడ్డిని ఏమీ చేయలేవు.

పోసాని కృష్ణమురళి ఇంటిపై దాడి చేస్తే పవన్ కళ్యాణ్ ఫామ్ హౌస్‌లో పడుకున్నాడు. ఇప్పుడు టీడీపీ ఆఫీస్‌లో రెండు కుర్చీలు ఇరగ్గానే ప్రజాస్వామ్యం ఖూనీ అంటాడు. ఇప్పటికైనా టీడీపీ నేతలు వాళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి . యుద్ధంలో మగాళ్లతో ఫైట్ చేస్తాం. లోకేష్ లాంటి అటూ ఇటూ కానీ వాళ్ళతో ఏమి యుద్ధం చేస్తాం. లోకేష్ విసిరిన ఛాలెంజ్‌కు మేము స్పందించలేము. వైఎస్‌ పెట్టిన అభ్యర్థిపై చిత్తుగా ఓడిపోయిన వాడితో మాకేంటి పోటీ. జీవితంలో ఎమ్మెల్యే అయ్యి ఆ తర్వాత లోకేష్ ఛాలెంజ్ చేయాలి.’ అని మంత్రి కొడాలి నాని సవాల్‌ విసిరారు.