ప్రభాస్‌ చెప్పినా వినడం లేదు : కృష్ణంరాజు

Krishnam Raju Responds on Prabhas Marriage

‘బాహుబలి’ చిత్రంతో ఆల్‌ ఇండియా సూపర్‌ స్టార్‌గా పేరు తెచ్చుకున్న హీరో ప్రభాస్‌ ప్రస్తుతం ‘సాహో’ చిత్రాన్ని చేస్తున్నాడు. సుజీత్‌ దర్శకత్వంలో భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ‘సాహో’ చిత్రం వచ్చే సంవత్సరం వేసవిలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలున్నాయి. రికార్డు స్థాయి బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్‌ వారు నిర్మిస్తున్నారు. ‘బాహుబలి’ చిత్రం పూర్తి అయిన వెంటనే ప్రభాస్‌ పెళ్లి చేసుకుంటాడని అంతా భావించారు. కాని అనూహ్యంగా ప్రభాస్‌ వివాహంను వాయిదాల మీద వాయిదాలు వేస్తూ వస్తున్నాడు. కుటుంబ సభ్యులు పెళ్లి చేసుకోవాల్సిందిగా ఎంతగా రిక్వెస్ట్‌ చేసినా, ఒత్తిడి చేసినా కూడా ప్రభాస్‌ మాత్రం పెళ్లికి ఒప్పుకోవడం లేదు. పెళ్లి విషయంలో ఎంతగా చెప్పి చూసినా కూడా ప్రభాస్‌ వినడం లేదు అంటూ స్వయంగా కృష్ణం రాజు చెప్పడం జరిగింది.

తాజాగా ఒక కార్యక్రమంలో పాల్గొన్న కృష్ణంరాజును మీడియా వారు ప్రభాస్‌ పెళ్లి గురించి ప్రశ్నించారు. ఆ సమయంలోనే కృష్ణం రాజు కాస్త అసహనంతో మాట్లాడుతూ… ప్రభాస్‌ ఏమీ చిన్న పిల్లాడు కాదు, మూడు పదుల వయస్సు దాటింది. అతడికి ఇంకా పదే పదే చెప్పాల్సిన పని లేదు. అతడి నిర్ణయం అతడు తీసుకోవాలని భావిస్తున్నాడు అంటూ ఈ సందర్బంగా కృష్ణం రాజు అన్నాడు. పెళ్లి ఎప్పుడు చేసుకుంటావ్‌ అంటూ తాము అడగడం, అతడు చేసుకుంటాను అంటూ చెప్పడం సర్వసాధారణం అయ్యింది. ప్రభాస్‌ ప్రస్తుతం చేస్తున్న సినిమా తర్వాత తన బ్యానర్‌లో సినిమా ఉంటుందని, ఆ సినిమాను ఆగస్టులో ప్రారంభించే అవకాశం ఉందంటూ కృష్ణంరాజు చెప్పుకొచ్చాడు. మొత్తానికి ప్రభాస్‌ పెళ్లిని వాయిదా వేస్తూ వస్తున్న కారణంగా మరేదైనా విషయం ఉందా అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.